వేధింపుల కేసులో రాఘవ్ అరెస్ట్, చిక్కుల్లో కనిమొళి
లాలూకు ఊరట
దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు సుప్రీం కోర్టులో మంగళవారం ఊరట లభించింది. దాణా కుంభకోణం కేసులో దిగువ కోర్టు నుంచి వెలువడాల్సిన తీర్పును నిలిపి వేసింది. ఈ రోజు కేసు విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కింది కోర్టు న్యాయమూర్తి పక్షపాతం చూపిస్తున్నారని లాలూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిబిఐకి సుప్రీం నోటీసులు జారీ చేసింది.
చిక్కుల్లో కనిమొళి
డిఎంకె అధినేత కరుణానిధి తనయ, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి మరిన్ని చిక్కుల్లో పడినట్లుగా కనిపిస్తోంది. 2జి కేసుకు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ అంశంలో కనిమొళి పైన ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) ఈ నెలాఖరులోగా ఛార్జీషీటు దాఖలు చేయనున్నదని తెలుస్తోంది.
రాజీనామాకు సిద్ధపడ్డ కేరళ సిఎం
సోలార్ కుంభకోణం ఏకంగా కేరళ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ మెడకు చుట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. సౌరశక్తి పరికరాల కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయం హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజీనామాకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.