కలిసి ఉండాలని కుటుంబ పెద్దగా చెబుతున్నా: బొత్స
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరడానికి తాము బొత్స సత్యనారాయణను కలిసినట్లు రాయలసీమకు చెందిన మంత్రి శైలజానాథ్ చెప్పారు. తమ అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తానని బొత్స హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కూడా కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, ఢిల్లీలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ నివాసంలో పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్తో పాటు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్, మధు యాష్కీ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతంలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉండదని, వారి భద్రతకు ముప్పు లేదని మధుయాష్కీ అన్నారు. సీమాంధ్ర ప్రజల భద్రత విషయంలో అపోహలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
విడిపోయిన తర్వాత అన్నదమ్ముల్లా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజలు ఉండాలని మరో పార్లమెంటు సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆశించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య కలుషిత వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్ర పెట్టుబడిదారులు దేశంలోని అతర ప్రాంతాల్లో మాదిరిగానే తెలంగాణలో కూడా ప్రాజెక్టులు చేసుకోవచ్చునని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినట్లు ఆయన తెలిపారు. కోర్ కమిటీ సమావేశంలో అందరి అభిప్రాయాలపై చర్చిస్తారని తాను అనుకుంటున్నట్లు తెలిపారు.