'టి'పై ఇందిర సెంటిమెంట్: వదిలేద్దామా అని కిరణ్ ప్రశ్న

 Kiran says Indira Gandhi was against to divide
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ విషయంలో దివంగత ఇందిరా గాంధీది సమైక్య బాట అని, దానిని వదిలేసి.. ఆమె మాటను జవదాటుదామా? అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గత శుక్రవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో అడిగినట్లుగా తెలుస్తోంది. 1969లో తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జై ఆంధ్ర ఉద్యమం జరిగినా రాష్ట్ర విభజనకు ఇందిర ససేమిరా అన్నారని, రాష్ట్రాన్ని ముక్కలుచేస్తూ పోయేది లేదని 1972 డిసెంబర్ 21న ప్రధాని హోదాలో ఇందిరా చారిత్రక ప్రసంగం చేశారని గుర్తు చేశారు.

కోర్ కమిటీ సమావేశంలో రకరకాలుగా సమైక్యవాదాన్ని వినిపించిన కిరణ్... ఇందిరమ్మ పేరిట సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా ప్రయోగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మనది ఇందిరమ్మ పార్టీ అని, ఆమె చూపిన బాట, అనుసరించిన విధానాలు మనకు శిరోధార్యమని, తాము కూడా రాష్ట్రంలో అనేక పథకాలను ఇందిరమ్మ పేరుతోనే ప్రారంభించామని, ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నామని చెప్పారట.

అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆలోచనలను, ఆమె భావాలను పక్కకునెట్టి నిర్ణయాలు తీసుకోగలమా? రాష్ట్ర ప్రయోజనాలపై ఇందిరమ్మకున్న అవగాహనకు భిన్నంగా వెళ్లగలమా? అని కిరణ్ ప్రశ్నించారట. రాష్ట్ర విభజనపై నాడు ఇందిరమ్మ పార్లమెంట్‌లో ఏం చెప్పారో ఒక్కసారి నిశితంగా పరిశీలించాలని, మనకూ ఒక పరిష్కారం కనిపిస్తుందని చెప్పారట. తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకబాటు అనే ఒక్క కారణం సరిపోదని, తాను ఇలాంటి వాటికి భయపడనని, రేపు ప్రతీ జిల్లాను కూడా విభజించమంటారని, ఒక్కసారి గతంలోకి వెళ్తే చాలా చిన్న రాష్ట్రాలు ఉండేవని, రాజరిక రాష్ట్రాలు ఉండేవని, మళ్లీ మనం రాజరికంలోకి వెళ్దామా? ఎక్కడో ఒక చోట నియంత్రణ రేఖ ఉండాలని ఇందిరమ్మ చెప్పారని కిరణ్ పేర్కొన్నారట.

కేవలం వెనుకబాటు కారణంగా విభజన ఉండాలని చెప్పవద్దని, మొత్తం జాతి కృషిచేసి, కష్టపడితేనే ఆర్థిక వెనుకబాటుతనం నిర్మూలించవచ్చునని, వెనుకబడ్డ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, కానీ, వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొనే స్వార్థపరులను అనుమతించకూడదని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై తాము వెనక్కు తగ్గడం లేదని, ఉద్యోగాల కల్పన, ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్నామని, తెలంగాణ ప్రజల సమస్యలపై తమకు శ్రద్ధ ఉందని, అయితే సమస్య పరిష్కారానికి విభజన మార్గం కాదని తాము భావిస్తున్నట్లు, తాను గతంలోనూ చెప్పినట్లుగా, రాష్ట్ర విభజన అనేది సమస్యకు పరిష్కారం కాదని, అది మరో అతిపెద్ద సమస్యకు ప్రారంభమేనని ఇందిర చేసిన ప్రసంగాన్ని కిరణ్ గుర్తు చేశారట.

ఇందిరా కోరుకున్నట్లుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికే గట్టిగా కట్టుబడి ఉన్నానని, ఒక వేళ రెండు రాష్ట్రాలు ఏర్పడినా అందులో పెద్దగా మార్పు ఉండదని, ఇందులో జంటనగరాల సమస్య కూడా ఉందని, ఇతర సమస్యలు కూడా అలాగే ఉంటాయని, పైగా, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఒక్కటే వెనుకబడిన ప్రాంతం కాదని ఇందిర చెప్పారని కిరణ్ కోర్ కమిటీ సభ్యులకు వివరించారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+