కడపలో వీరంగం: రాళ్లు, కర్రలతో ఎస్సైపై జగన్పార్టీ దాడి
జగన్ పార్టీ నాయకులు మందుకొట్టి, ఆ మత్తులో పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఎస్ఐని రక్తమొచ్చేలా కొట్టారు. నలుగురు కానిస్టేబుళ్లను గాయపరిచారు. పోలీసువర్గాల ప్రకారం... లింగాల మండలం అంబకపల్లె పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏగ్రీవమైంది. అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారు ఖాతాలో పడింది. దీంతో ఎన్నికైన మురళీ కృష్ణా గ్రామ సమీపంలోని గంగమ్మ గుడి వద్ద మంగళవారం మందుతో కూడిన విందు ఇచ్చారు.
పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెకు చెందిన రాజా (33), రవి (31) అనే యువకులు కూడా ఈ విందులో పాల్గొని తిరిగి ఇంటికి బయలుదేరారు. మద్యం మత్తులో బండి నడుపుతూ అంబకపల్లె సమీపంలోని డివైడర్ను ఢీకొని కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు పులివెందుల ఆస్పత్రికి చేర్చారు. అయితే రాజా మార్గమధ్యంలోనే చనిపోయాడు. ప్రమాదం సంగతి తెలిసిన లింగాల ఎస్సై రమేశ్ సంఘటన స్థలానికి వెళ్లారు.
ఈ దుర్ఘటనకు మద్యం తాగి వాహనం నడపడమే కారణమని తెలుసుకుని, స్థానికంగా ఉన్న బెల్ట్షాప్ వద్దకు వెళ్లారు. షాపులో ఎంత మద్యం నిల్వ ఉందంటూ దుకాణదారును ప్రశ్నించారు. తనిఖీ నిర్వహించారు. దీనిపై విచారణ జరుపుతుండగానే అప్పటికే విందులో పాల్గొని మద్యం మత్తులో ఉన్న జగన్ పార్టీ వర్గీయులు అక్కడికి వచ్చారు. ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. కొందరు రాళ్లతో దాడి చేయడంతో ఎస్సై తలకు గాయమైంది.
నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఎస్సై రమేశ్ తన సర్వీస్ రివాల్వర్తో గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో జగన్ పార్టీ కార్యకర్తలు చెల్లాచెదరైపోయారు. గాయపడిన ఎస్సై, ఇతర సిబ్బంది చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి వచ్చారు. వీరిని మంగళవారం రాత్రి కడప ఎస్పీ మనీశ్ కుమార్ సిన్హా పరామర్శించారు. దాడికి సంబంధించి ఆ పార్టీ నాయకులు 40 మందిపై కేసు నమోదు చేసినట్లు పులివెందుల రూరల్ ఎస్ఐ శంకరయ్య తెలిపారు. పోలీసులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ మనీష్ కుమార్ తెలిపారు.