ధర్మాన, సబిత రెడ్డిల కస్టడీ మెమోపై తీర్పు వాయిదా
సబిత, ధర్మానలను జ్యూడిషియల్ కస్టడీకి పంపాలన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మెమో పైన గురువారం వాదనలు పూర్తయ్యాయి. అనంతరం తీర్పును సిబిఐ కోర్టు వాయిదా వేసింది.
కాగా జగన్ కేసులో ధర్మాన, సబితాల పైన ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ, వారిని జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని గతంలో మెమో దాఖలు చేసింది. ఆ మెమోపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు మాజీ మంత్రులను ఆదేశించింది. దీంతో వారు కౌంటర్ దాఖలు చేసిన అనంతరం విచారణ ప్రారంభమైంది.
తమ పేర్లను ఛార్జీషీటులో దాఖలు చేయడంతో మంత్రులుగా ఉన్న వీరు రాజీనామాలు చేశారు. ఆ సమయంలో వారు మీడియాతో మాట్లాడారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషులుగా బయటకు వస్తామని చెప్పారు. దీంతో సిబిఐ వారిద్దరు మంత్రులుగా పనిచేశారని, రాజకీయంగా పలుకుబడి కలిగినవారని, అధికార వర్గాల్లో ప్రాబల్యం ఉందని, ఈ నేపథ్యంలో వారు మాట్లాడిన మాటలు సాక్షుల్ని ప్రభావితం చేస్తాయని, వారిని కస్టడీకి తీసుకుంటామని మెమో దాఖలు చేసింది.