షర్మిల యాత్ర: సెక్యూరిటీ దాడి, యువకుడికి గాయాలు
చేనేత కార్మికుల బాగు కోసం ఏం చేయాలనే అంశాన్ని జగన్ ఎప్పుడో ఆలోచన చేశారని ఆమె అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నాడు తీసుకు వచ్చిన పథకాలన్నింటిని జగన్ ముఖ్యమంత్రి అయితే అమలు చేస్తారన్నారు.
శుక్రవారం షర్మిల పాదయాత్ర 221వ రోజుకు చేరుకుంది. ఆముదాలవలస నియోజకవర్గంలోని శిలగాంసింగువలస గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. గుండువిల్లిపేట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రంలో షర్మిల విశ్రాంతి తీసుకున్నారు. ఆమె 14 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు 2,969 కిలోమీటర్లు నడిచారు.
సెక్యూరిటీ అత్యుత్సాహం
షర్మిల పాదయాత్ర సందర్భంగా వ్యక్తి గత భద్రతా సిబ్బంది అత్యుత్సాహంతో ఓ యువకుడు గాయాలపాలయ్యాడు. మడపాం టోల్ ప్లాజా సమీపంలో షర్మిలను చూసేందుకు మడపాం యువకులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆమె వ్యక్తిగత సిబ్బంది కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సంతోష్ అనే యువకుడికి తలపై బలమైన గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయగా, స్థానిక నేతలు నచ్చచెప్పారు.