రాయల తెలంగాణకు తెలంగాణ నేతలూ 'నో'
రాష్ట్ర విభజన అనివార్యమని బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ప్రజలు హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ప్రకటించడాన్ని సారయ్య వ్యతిరేకించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకునే తెలంగాణ జెఎసి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సహా ఇతర పార్టీలు రాయల తెలంగాణను వ్యతిరేకించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రాయల తెలంగాణ విషయాలపై జరుగుతున్న ప్రచారంపట్ల ఆయన శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాయలసీమ ప్రజల అభిప్రాయం మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని, కొందరు రాజకీయ నేతలను టార్గెట్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంకోసం తెలంగాణలో జరిగినట్లుగానే రాయలసీమలోను బలిదానాలు జరిగే అవకాశముందని ఆ ప్రాంతనేతలు కేంద్రానికి తెలియజేయాలని ఆన్నారు. రాయలసీమను విడగొట్టి 12 జిల్లాలతో కొత్త రాష్ట్ర ఏర్పాటు రాయలసీమ దేహాన్ని ముక్కలు చేసినట్లవుతుందని మందకృష్ణ వివరించారు.
రాజీనామా డ్రామాలు వద్దు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న సీమాంధ్ర ప్రాంత నేతలు రాజీనామా డ్రామాలు ఆడవద్దని కాంగ్రెస్ శాసనసభ్యుడు మహేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2004, 2009 ఎన్నికల సందర్భంగా విభజనపై హామీ ఇచ్చి, ఇప్పుడు నిరసనలు తెలపడం తగదని అన్నారు. వెయ్యి మంది విద్యార్థులు ప్రాణ త్యాగం చేసి సాధించుకుంటున్న తెలంగాణకు అడ్డొస్తే సీమాంధ్ర నేతలను ప్రజలు ఉపేక్షించరన్నారు.
సీమాంధ్ర నేతలు హైదరాబాద్ను అభివృద్ధి చేశామనడంలో నిజం లేదని, అప్పుడున్న అసెంబ్లీ భవనం, అప్పుడున్న ఉస్మానియా మెడికల్ కళాశాలలే ఇప్పటికీ ఉన్నాయన్నారు. వారి ఆస్తులను అభివృద్ధి చేసుకున్నారే గానీ, హైదారాబాద్ను అభివృద్ధి చేయలేదన్నారు. విభజనకు అడ్డు వస్తే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. వారు రాజీనామాలు చేసి ఉంటే స్పీకర్కు లేఖలు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం లేదని, తెలంగాణలోనే ఉందన్నారు. రాయల తెలంగాణ ప్రస్తావనే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
పది జిల్లాలతోనే రాష్ట్రం
తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరబోతోందని, డిసెంబరు 9 నాటి ప్రకటనను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రి డికె అరుణ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా గద్వాలలోని తన నివాసంలో శనివారం మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడారు తెలంగాణ ప్రజల ఎదురుచూపులను, వారి సహనాన్ని, నమ్మకాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రకటనను చేయబోతుందన్నారు. 10 జిల్లాల తెలంగాణకే తెలంగాణ ప్రాంత నాయకులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.