టి ఎఫెక్ట్: కిరణ్పై మంత్రుల ఒత్తిడి, డిఐజి రాజీనామా
పదిహేను మంది మంత్రులు సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు రాజీనామాలు అంటే అందరు రాకపోయినా ఎక్కువ మంది వస్తారని భావిస్తున్నారు. అయితే రాజీనామాలు ఇప్పుడే వద్దని, అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక అది అమలుకాకుండా చూసే క్రమంలో రాజీనామాలు చేస్తే సరిపోతుందని కిరణ్ వారికి సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
రాయల తెలంగాణపై డిఐజి నిరసన
రాయలసీమను రెండు ముక్కలు చేసి అటో ముక్కను, ఇటో ముక్కను తోకలా తగిలించాలనే ఆలోచనలపై సామాన్య జనంతోపాటు ఉన్నతాధికారులూ రగులుతున్నారు. అదే జరిగితే న్యాయపోరాటం చేయాలని కొందరు ఐఏఎస్లు నిర్ణయించుకోగా ఓ డిఐజిఅధికారి ఆదివారమే తన ఉద్యోగం వదులుకున్నారు.
రాయలసీమను విచ్ఛిన్నం చేయాలనే సంకేతాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇక బాధ్యతల్లో కొనసాగలేనంటూ డిఐజి మహ్మద్ ఇక్బాల్ స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.
కానీ, రాయలసీమను ముక్కలు చేయాలనే ఆలోచనను వ్యతిరేకిస్తూనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఐపిఎస్ అధికారి ఇక్బాల్ తీసుకున్న నిర్ణయం సీమ నేతలకు చెప్పుదెబ్బలాంటిదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.