కిరికిరి లేకుండా ఇవ్వరు, అందుకే మాట్లాడట్లేదు: కెసిఆర్
తెలంగాణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుందని అయితే, ఏదో ఒక రూపంలో కిరికిరి పెట్టకుండా మాత్రం ఇచ్చేట్లు లేదని, మనం అడిగినట్లుగా కాకుండా రాయల తెలంగాణా అనో, లేదా హైదరాబాద్పైనో ఏదో ఒక మెలిక పెడుతుందని, అందువల్లే కాంగ్రెస్ కానీ, యూపీఏ భాగస్వామ్యపక్షాలు కానీ తమతో మాట్లాడడం లేదని ఆయన తమ పార్టీ నేతల వద్ద సందేహం వ్యక్తం చేశారట. తెలంగాణాపై కేంద్రం ఎటువంటి కిరికిరి పెట్టినా సహించే ప్రసక్తే లేదని చెప్పారు.
సిడబ్ల్యూసి సమావేశం జరిగే రోజునే మనం కూడా కార్యాచరణను ప్రకటిద్దామని భేటీలో పేర్కొన్నారు. నవంబర్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని కెసిఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. అంతకు ముందే విభజన ప్రకటన వెలువడుతుందని, వాళ్లు అనుకున్నట్లుగానే విభజిస్తారని కెసిఆర్ వ్యాఖ్యానించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తామంటే తెరాసను కాంగ్రెస్లో విలీనం చేస్తామని తాను ఢిల్లీలోనే రెండుసార్లు చెప్పానని పేర్కొన్నారు.
తాము ప్రతిపాదిస్తున్న తెలంగాణ కాకుండా ఎలా ఇచ్చినా కృష్ణా జలాల పంపిణీ సహా మరెన్నో సమస్యలు తలెత్తుతాయని, రాయల తెలంగాణ ఇస్తే జలాలపరంగానే కాకుండా మరెన్నె అంశాల్లో అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వకుంటే భారీ ఆందోళనకు సిద్ధం కావాలని భేటీలో చెప్పారు. రాయల తెలంగాణతో సర్దుకుటే నీటి యుద్దాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.