రేపే తెలంగాణపై నిర్ణయం, కట్టుబడి ఉన్నాం: దిగ్విజయ్
నాయకులంతా పార్టీ నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన వల్ల తమ పార్టీ గెలుస్తుందా, లేదా అనేది ముఖ్యం కాదని, తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తామని, జాతీయ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని అమలు చేస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు
తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదని, దాదాపు 12, 13 ఏళ్లు సంప్రదింపులు జరిపామని, సంప్రదింపులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. కేంద్రం తెలంగాణ ఇస్తుందని అనుకుంటున్నట్లు అజిత్ సింగ్ అన్నారు. సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కుతుందని ఆయన అన్నారు.
కాగా, తెలంగాణపై రేపు సాయంత్రం జరిగే కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. సిడబ్ల్యుసి సమావేశానికి ముందు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ యుపిఎ భాగస్వామ్య పక్షాలతో సమావేశమై, తెలంగాణపై తీసుకుని నిర్ణయాన్ని తెలియజేస్తారు. అయితే, సిడబ్ల్యుసి ఎజెండా తనకు తెలియదని దిగ్విజయ్ సింగ్ అన్నారు.