జగన్కు కూన శ్రీశైలం షాక్!: పాతగూటికే కొండా సురేఖ
కూన శ్రీశైలం గౌడ్ మూడు నాలుగు నెలల క్రితమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో చాలా సాన్నిహిత్యం ఉండేది. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ స్థాపించిన తొలి నాళ్లలోనే ఆయన ఆ పార్టీలోకి వెళ్తారని భావించారు. కానీ ఇటీవల జైలులో జగన్ను కలిసి పచ్చజెండా ఊపారు.
అయితే ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా పార్టీ ఉందనే అభిప్రాయం ప్రజల్లోకి జోరుగా వెళ్లింది. ఆ కారణంగానే పలువురు తెలంగాణ ప్రాంత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో కూన కూడా అదే దారిలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డితో చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు కొండా సురేఖ కూడా కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని సమాచారం. కొద్ది రోజుల కింద కొండా దంపతులు బిజెపిలోకి చేరుతారనే ప్రచారం సాగింది. వారితో ఆ పార్టీ నేతలు చర్చలు కూడా జరిపారట. అయితే ఇప్పుడు కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో వారు మరోసారి యూ టర్న్ తీసుకొని కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని అంటున్నారు. వారికి మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి రాజకీయ గురువు ఆయనే.