విగ్రహాల ధ్వంసం: సోనియా సీరియస్, చర్యలకు ఆదేశం
న్యూఢిల్లీ/హైదరాబాద్: సీమాంధ్రలో విగ్రహాల ధ్వంసంపై ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. యూపిఏ, సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా రెండు రోజుల క్రితం తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
దీనిపై రెండు రోజులుగా సీమాంధ్రలో బంద్, రాస్తారోకోలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు పలు ప్రాంతాలలో దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అనంతపురంలో ఇందిరా విగ్రహానికి నిప్పు పెట్టి కాల్చివేశారు. కొన్ని ప్రాంతాల్లో చెప్పుల దండలు వేశారు.

ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత నేతలు అధిష్టానానికి చెప్పారు. ఇది తెలుసుకున్న సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారట. దీనిపై రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జాతీయ నాయకుల విగ్రహాలకు అవమానం జరిగితే తల్లిదండ్రులకు జరిగినట్లేనని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారిపై అలాంటి చర్యలే తీసుకోవాలని మండిపడ్డారు.
మరోవైపు హైదరాబాదుకు మంత్రులు వట్టి వసంత్ కుమార్, ఆనం రామనారాయణ రెడ్డి వచ్చారు. సీమాంధ్ర నేతలమంతా మాట్లాడుకున్నామని, అప్పుడే ఏమీ పూర్తి కాలేదన్నారు.












Click it and Unblock the Notifications