ఇందిరా, రాజీవ్ విగ్రహాల ధ్వంసం సరి కాదు: కెవిపి

సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలని ఇందిరా గాంధీ భావించారని, 1969, 1972 చెలరేగిన బలమైన, హింసాత్మక ఉద్యమాల తర్వాత కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి ఇందిరా గాంధీ కారణమని ఆయన అన్నారు. దేశం కోసం రాజీవ్ గాంధీ చాలా పన్ని వయస్సులోనే ప్రాణ త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. మరణం తర్వాత కూడా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ స్ఫుర్తి ప్రదాతలుగా నిలిచారని ఆయన అన్నారు.
దేశం కోసం త్యాగాలు చేసిన మన జాతీయ నేతల స్మారకాలను రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని స్వార్థపర శక్తులు అమాయక ప్రజలు లక్ష్యం చేసుకునే విధంగా రెచ్చగొడుతున్నాయని ఆయన విమర్శించారు. అసంతృప్తిని, ఆగ్రహాన్ని, ఉద్వేగాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేసే హక్కు ఉందని, ప్రజాతంత్ర పద్ధతిలో మన భావవ్యక్తీకరణ ఉంటే గౌరవిస్తారని, ఉద్యమాలూ ప్రదర్శనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని ఆయన అన్నారు. దేశ గౌరవానికి భంగం కలిగించే చట్ట వ్యతిరేక శక్తుల చేతిలో పనిముట్లుగా మారకూడదని ఆయన సూచించారు.
కాంగ్రెసు పార్టీ మాత్రమే ప్రజాస్వామిక సూత్రాలను చిత్తశుద్ధితో తూచా తప్పకుండా పాటిస్తోందని, ఒక దేశం ఒక కుటుంబం అనే నినాదంతో పనిచేస్తోందని కెవిపి అన్నారు. దిష్టిబొమ్మల దగ్ధం మహా నాయకుల అభిమానుల మనోభావాలను దెబ్బ తీస్తాయని ఆయన అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, మన్మోహన్ సింగ్ మన దేశానికి దిశానిర్దేశం చేశారని చెప్పారు.
రాష్ట్రాన్ని విభజించాలనే కాంగ్రెసు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న ఉద్యమాలను, ప్రజల మనోభావాలను తాను ఖండించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలను, బాధను, ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకుంటానని, ఆరు దశాబ్దాల తర్వాత కుటుంబం చీలిపోయిన భావన కలగడం సహజమని ఆయన అన్నారు. తన తరఫున, తన సహచరుల తరఫున తాను ఆందోళన చేస్తున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, తమను తాము బాధపెట్టుకోవద్దని, చట్టాన్ని గౌరవించే దేశ పౌరులుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించకూడదని ఆయన అన్నారు. లక్ష్యాన్ని సాధించే వరకు మన ఆగ్రహాన్ని, అసంతృప్తిని ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తీకరిద్దామని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications