కెసిఆర్ వ్యాఖ్యలను వక్రీకరించారు: హరీష్ రావు

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏం జరుగుతుందో ఎస్సార్సీలో చెప్పిన విషయాన్నే కెసిఆర్ చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాలు చెప్పిన విషయాన్నే కెసిఆర్ చెప్పారని, అందులో కొత్త విషయమేమీ లేదని, సంచలనం సృష్టించే అంశం ఎంత మాత్రమూ లేదని ఆయన అన్నారు.
కెసిఆర్ వ్యాఖ్యల్లో ఉద్దేశ్యాలు గానీ దురుద్దేశ్యాలు గానీ లేవని ఆయన అన్నారు. ఏదో అయిపోయిందని బురద జల్లే కార్యక్రమం చేపట్టడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులు అక్కడికి వెళ్లిపోవడమే కాదు, ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఇక్కడికి రావాలని కూడా కెసిఆర్ అన్నట్లు ఆయన తెలిపారు. కెసిఆర్ అన్న ఈ మాటలనే పట్టుకున్న మీడియా అన్నదమ్ముల్లా విడిపోదాం, హైదరాబాదులో ఉన్న ఇతర ప్రాంతాలవారు మా బిడ్డలేనని, కడుపులో పెట్టుకుంటామని కెసిఆర్ చెప్పిన మాటలను ఎందుకు గుర్తు చేయరని ఆయన అడిగారు.
పొట్ట కూటి కోసం వచ్చినవాళ్లకు తాము వ్యతిరేకం కాదని కెసిఆర్ పలు సందర్భాల్లో చెప్పారని, తాము ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నామని, పిడికెడు మంది పెట్టుబడిదారులకు మాత్రమే తాము వ్యతిరేకమని కెసిఆర్ చెప్పారని ఆయన అన్నారు. అపోహలు సృష్టించే విధంగా వక్రీకరించడం సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే 25 వేల మంది ఉద్యోగులు వెళ్లిపోవాల్సి ఉంటుందని ఓ పత్రిక రాసిందని, ప్రక్రియలో భాగంగా వెళ్లిపోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్రం విడిపోయే సందర్భంలో ఓ వర్గం మీడియా పనిగట్టుకుని అపోహలు సృష్టించే విధంగా ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. మీడియా పోషిస్తున్న పాత్ర గురించి చాలా ఉందని, అది వేరే సందర్భంలో చెప్తానని, ఎవరు ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారనే విషయాలు తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజల మధ్య అపోహలు తొలగించి, నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన మీడియా దాన్ని విస్మరించి వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు. తెలంగాణ ఉద్యమం విషయంలో పాటించిన మార్గదర్శక సూత్రాలను అక్కడి ఉద్యమం విషయంలో కూడా పాటించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జరిగే ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం ఎలా అవుతుదని, తెలంగాణ జిల్లాలు లేకుండా సమైక్యాంధ్ర ఉద్యమం ఎలా అవుతుందని, అది సీమాంధ్ర ఉద్యమం మాత్రమే అవుతుందని హరీష్ అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో తమ పార్టీ శాసనసభ్యులను, కార్యకర్తలను, నాయకులను మాత్రమే కాకుండా కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను కూడా అర్థరాత్రుళ్లు అరెస్టు చేశారని, రోడ్డు మీదికి రాక ముందే అరెస్టు చేశారని, బైండోవర్లు చేశారని, సీమాంధ్రలో మాత్రం అందరినీ వదిలేస్తున్నారని ఆయన అన్నారు. తాము సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని, సీమాంధ్ర ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాలని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలకు ఏ విధమైన అనర్థాలు జరగవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications