కిరణ్, బొత్స రాజీనామాలకు పట్టు: సమైక్యమే

ఈ సమావేశంలో 20 మంది సీమాంధ్ర మంత్రులు, 43 మంది శాసనసభ్యులు, 15 మంది ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సమావేశంలో రెండు తీర్మానాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏకవాక్య తీర్మానం చేశారు. అలాగే, సిడబ్ల్యుసిలో విభజనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మరో తీర్మానం చేశారు. ఈ రెండు తీర్మానాలను పార్టీ అధిష్టానానికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ అధిష్టానం దిగి రావాలంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని మెజార్టీ ప్రజాప్రతినిధులు పట్టుపట్టినట్లు తెలుస్తోంది. రాజీనామాలతోనే అధిష్టానం దిగి వస్తుందని వారన్నారు. రాజీనామాలు చేయడం వల్ల ఫలితం ఉండదని, మాట్లాడే అవకాశాలను కోల్పోతామని, రాజీనామాలు వద్దని కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్లు సమాచారం. రాజీనామాలు చేయవద్దని ఆయన నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వేసే ఉన్నత స్థాయి కమిటీ ముందు వాదనలు వినిపించే అవకాశం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స ప్రజాప్రతినిధులకు చెప్పారు. అయినా, మెజారిటీ శాసనసభ్యులు రాజీనామాలు చేయడానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఏక వాక్య తీర్మానం చేసి, దాన్ని అధిష్టానానికి పంపించాలని సమావేశం నిర్ణయించింది. లక్ష మందితో హైదరాబాదులో మార్చ్ ఫాస్ట్ చేయాలని జెసి దివాకర్ రెడ్డి ప్రతిపాదించారు. రాజీనామాలు అందరూ చేయాలని గాదె వెంకటరెడ్డి సూచించారు. పార్టీకి, పదవులకు చేసిన రాజీనామాలకు శానససభ్యులు కట్టుబడి ఉన్నట్లు శాసనసభ్యులు పొన్నాడ సతీష్, వరప్రసాద్ చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమానికి సారథ్యం వహించాలని శాసనసభ్యులు కోరారు. రాష్ట్ర విభజనకు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలుగు జాతి కాంగ్రెసు అధిష్టానాన్ని క్షమించదని వారన్నారు. సిడబ్ల్యుసి సమావేశం తర్వాత ప్రకటన చేసే వరకు రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు తమకు తెలియదని ఆయన అన్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెసు పార్టీ నష్టపోతుందని వారన్నారు.
సిడబ్ల్యుసి తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ సమావేశంలో మరో తీర్మానం కూడా చేశారు. తమను సముదాయించినా ప్రజాగ్రహాన్ని ఆపలేరని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో చెప్పారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధిష్టానం వెనక్కి తగ్గుతుందని అనుకుంటున్నట్లు చెప్పారు.
హైదరాబాదును శాశ్వతంగా ఉమ్మడి రాజధానిగా చేయడం, కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం, దేశానికి రెండో రాజధానిగా చేయడం అనే మూడు ప్రత్యామ్నాయాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మూడు గంటలకుపైగా ముఖ్యమంత్రితో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశంలో వాడిగా వేడిగా జరిగింది.












Click it and Unblock the Notifications