తండ్రికి తగ్గ బిడ్డ షర్మిల: హైదరాబాద్ వ్యాఖ్యలపై హరీష్
సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం ప్రజలు చేస్తోంది కాదని, తెలంగాణలో జెండా పీకేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తోందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బతికుండగా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు పూర్తయ్యాక సీమాంధ్రకు వెళ్లి హైదరాబాదు వెళ్లాలంటే వీసా కావాలని అక్కడి ప్రజలను రెచ్చగొట్టారని, ఇప్పుడు షర్మిల అక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా హైదరాబాదు ఏమైనా పాకిస్తాన్లో ఉందా అని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.
షర్మిల పెరిగింది, చదువుకున్నది హైదరాబాదులోనేనని గుర్తుంచుకోవాలని, వైయస్ అంత పెద్ద నాయకుడు కావడానికి హైదరాబాదే కారణమని తెలుసుకోవాలని హరీష్ రావు అన్నారు. రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడవచ్చునని కానీ, తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నారు. హైదరాబాదులో ఇన్ని రోజులు షర్మిల ఎలా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాయలో సీమాంధ్ర ప్రజలు పడవద్దన్నారు.
షర్మిలపై కేసు పెట్టాలి
హైదరాబాదును పాకిస్తాన్తో పోల్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల పైన కేసు పెట్టాలని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆమె వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు.