డైరెక్టర్గా కెసిఆర్ ఒకే: టి-టిడిపి, నన్నపనేని కంటతడి
ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి ఒత్తిడి పెంచాలని ఈ ప్రాంత నేతలకు పిలుపునిచ్చారు. విధిలేని పరిస్థితుల్లో, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్న భయంతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. సీమాంధుల భయాందోళనలు తొలగించేలా కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం వారితో మాట్లాడాలని సూచించారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో అందరి పాత్ర ఉందన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంపై అన్ని పార్టీలూ కలిసి మాట్లాడుకుందామని ఆహ్వానం పలికారు. కెసిఆర్ అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయినట్లు కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో తెరాస ఒకటి రెండు జిల్లాలకు, అదీ కొన్ని సెగ్మెంట్లలో మాత్రమే పరిమితమైందన్నారు. దీంతో కంగుతిన్న కెసిఆర్ మరోమారు తన మార్కు రాజకీయం చేస్తున్నాడన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి టిడిపి నాయకత్వమే సరైనదని స్పష్టం చేశారు.
వైయస్ ప్రారంభించారు... సోనియా పూర్తి చేశారు
ప్రత్యేక తెలంగాణవాదాన్ని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే... ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పుడు పూర్తి చేశారని టిడిపి నేతలో బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నన్నపనేని రాజకుమారిలు విమర్శించారు. తెలంగాణ నిర్ణయంపై ఓ కమిటీ వేస్తామని, అందులో తానూ ఉంటానని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పడంపై వారు మండిపడ్డారు.
కొంపముంచి పోయాక కమిటీ ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత కేంద్ర, రాష్ట్ర మంత్రులు పనికిమాలిన వాళ్లయ్యారని దుయ్యబట్టారు. సీమాంధ్రులకు భరోసా ఇచ్చే నాథుడే లేకుండా పోయాడంటూ నన్నపనేని కంటతడి పెట్టారు. రాష్ట్ర విభజన జరగదని, చరిత్రను తిరగరాస్తామని వ్యాఖ్యానించారు.