వెల్లోకి సీమాంధ్ర ఎంపీలు, నిమిషాల్లో రిజైన్ చేసేవాడ్ని
న్యూఢిల్లీ/హైదరాబాద్: పార్లమెంటులో మూడో రోజు కూడా సమైక్య గళం వినిపిస్తోంది. బుధవారం ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే సీమాంధ్ర సభ్యులు సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. మరోవైపు జవాన్ల మృతిపై ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ చర్చకు డిమాండ్ చేసింది. దీంతో ఉభయ సభలో వాయిదా పడ్డాయి.
అనంతరం రాజ్యసభ ప్రారంభమైనా తెలుగుదేశం పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్లు చైర్మన్ వెల్లోకి చొచ్చుకు పోయే ప్రయత్నం చేశారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరిగే వరకు తాము ఆందోళన చేస్తామని చెప్పారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో రాజ్యసభను మరోసారి వాయిదా వేశారు.

లోకసభలో కాంగ్రెసు, టిడిపి ఎంపీలు వెల్ లోకి దూసుకు వెళ్లారు. సీమాంధ్ర టిడిపి ఎంపీలతో కాంగ్రెసు పార్టీకి చెందిన లగడపాటి రాజగోపాల్, ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, హర్ష కుమార్లు సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టే ప్రయత్నాలు చేశారు. స్పీకర్ సభను పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు.
పార్లమెంటులో బుధవారం విభజతో పాటు సరిహద్దుల్లో కాల్పుల ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. ఉభయ సభల్లోను దీనిపై గందరగోళం చెలరేగింది.
ఐదు నిమిషాల్లో...: మోదుగుల
తాను ముఖ్యమంత్రిని అయితే ఐదు నిమిషాలలో రాజీనామా చేసేవాడినని ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సీమాంధ్రలో ఆందోళనలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
సీమాంధ్రలో కేసులు
సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనకారులపై కేసులు నమోదవుతున్నాయి. వారం రోజులుగా ఉద్యమం జరుగుతోంది. దాదాపు 124 క్రిమినల్ కేసులు నమోదు కాగా వెయ్యి మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆస్తుల కేసులు 221 నమోదైనట్లుగా సమాచారం.
విగ్రహాల కూల్చివేతపై 34 కేసులు నమోదు కాగా 92 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విగ్రహాలను కూల్చితే వదిలేది లేదని పోలీసులు చెబుతున్నారు. రక్షణ కల్పిస్తామన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళనకారులపై బలప్రయోగం చేయవద్దని అధికారులకు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications