జగన్కు గుడ్బై: కూకట్పల్లి నుంచి హీరో శ్రీహరి పోటీ
హైదరాబాద్: రియల్ స్టార్ శ్రీహరీ వచ్చే ఎన్నికల్లో హైదరాబాదులోని కూకట్పల్లి శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన గురువారంనాడు ఈ విషయం చెప్పారు. వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్బై చెప్పి ఆయన కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్లు నటుడు శ్రీహరి ఇటీవల కూడా తెలిపారు. అయితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడైన శ్రీహరి ఆయన మరణానంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతారని నిరుడు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా హైదరాబాదులోని చంచల్గూడ జైలులో ఉన్న జగన్ను కలిసిన శ్రీహరి త్వరలో తాను వైయస్సార్ కాంగ్రెసులో చేరతానని ప్రకటించారు కూడా.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు మారిపోవడం, సమైక్యాంధ్రకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జై కొట్టడంతో తెలంగాణలో ఆ పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీహరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆగస్టు 15న తన జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ఆయన తేల్చిచెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు చిత్రసీమ మాత్రం విడిపోదనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిత్రసీమలో ఆంధ్ర, తెలంగాణ భేదాలున్నాయని తాను అనుకోవడంలేదనీ, తాను తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తినైనా తనపట్ల ఎవరూ వివక్షతో వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు.