తేల్చేసిన బొత్స: విభజనతో ఆంటోనీకి కమిటీకి నో లింక్
శుక్రవారం గాంధీభవన్లోని ఆయన ఛాంబర్లో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విభజన రాజ్యాంగ ప్రక్రియ అని, దానికీ ఆంటోని కమిటీకి సంబంధం లేదన్నారు. పార్టీకి సంబంధించిన శానససభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు తన అభిప్రాయాలను తెలిపేందుకు ఏ విధమైన గడువు లేదని బొత్స చెప్పారు. 14, 15వ తేదీల్లో కొంత మంది కేంద్ర మంత్రులు, ఎంపీలు ఆంటోని కమిటీని కలిసి విభజన సమస్యలపై వివరించినట్లు తెలిపారు.
19, 20 తేదీల్లో పార్టీకి చెందిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు వారి అభిప్రాయాలను కమిటీకి తెలియజేసుకోవచ్చని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధిష్టానం తనను ఆదేశించిందని చెప్పారు. హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు ప్రత్యేకంగా కమిటీతో భేటీ కాదలిచామని మంత్రి నాగేంద్ర కోరారని తెలిపారు. ఏ జిల్లా వారైనా ప్రత్యేకంగా ఆంటోని కమిటీకి తమ అభిప్రాయాలు చెప్పదలచుకుంటే కమిటీ అనుమతి తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
విభజన నేపధ్యంలో హైదరాబాద్కు సంబంధించి, రాజధాని విషయం, నీటి సమస్యల గురించి వారి అభిప్రాయాలను కమిటీకి వివరించవచ్చునని అన్నారు. ఆంటోని కమిటీతో భేటీకి అనుమతి ఇప్పించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడిగారన్నారు. మీడియా సంయమనం పాటిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత అభిప్రాయాలు అజెండాగా పెట్టుకుని గతంలో తెలంగాణ ఉద్యమం ఎక్కువ చేసి చూపించారని, ఇప్పుడదే చేస్తున్నారన్నారు.
ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తాను ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మాట్లాడటం లేదని, వ్యక్తుల కంటే వ్యవస్థలు ముఖ్యమన్నారు. 30వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో అప్పటి వరకు ఆంటోని కమిటీకి చెందిన అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి నివాసంలో సీమాంధ్రకు చెందిన నేతలు సమావేశమవుతారని బొత్స సత్యనారాయణ చెప్పారు.