స్టాఫ్ బదిలీలకు పద్ధతి ఉంది, రెచ్చగొట్టొద్దు: బాబు
హైదరాబాద్: రాష్ట్రం విడిపోతే ఉద్యోగుల బదిలీలు ఏ ఒక్కరి ఇష్టానిష్టాలపై ఆధారపడి ఉండవని, బదిలీలు విధివిధానాల ప్రకారమే జరుగుతాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వివిధ వార్తాపత్రికల సంపాదుకులు, ప్రతినిధులతో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రభుద్వ విధానాలపై ఆధారపడే ఉద్యోగుల బదిలీలు ఉంటాయని ఆయన చెప్పారు.
కొందరు నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చెసి ప్రశాంతతకు భంగం కలిగించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసే మాటలు మంచిది కాదని ఆయన రాజకీయ నేతలకు సూచించారు. ఈ నెల 19వ తేదీన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనలతో ఉద్యోగులు భయపడవద్దని, రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, సీమాంధ్రలో చోటు చేసుకున్న ఆందోళనలను పరిష్కరించేందుకు సంపాదకుల నుంచి చంద్రబాబు సూచనలను, సలహాలను తీసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు సంపాదకులు నిరాకరించారు.
రాష్ట్ర విభజనపై తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చంద్రబాబు సంపాదుకులతో చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications