లేఖల చిచ్చు: బాబుకు హరికృష్ణ చిక్కులు, అసంతృప్తి
హరి సమైక్యవాదం కోసం బహిరంగంగా లేఖ రాయడం బాబుకు చిక్కే అంటున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడిన ఇతర సీనియర్ నేతలు పార్లమెంటు నుండి ఉద్యమం వరకు సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో హరి లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఇతర నేతలు అయితే చంద్రబాబు బుజ్జగించి వెనక్కి తీసుకనేలా చేసేవారు. హరికృష్ణ లేఖ రాయడంతో బాబు ఏం చేస్తారనే చర్చ సాగుతోంది.
పార్టీలో హరికృష్ణ మొదటి నుండి కాంట్రవర్సీగానే ఉన్నారని ఇంకొందరు గుర్తు చేస్తున్నారు. ఆయన తన వ్యాఖ్యల ద్వారా ఎప్పుడు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని చెబుతున్నారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హరి లేఖ రాయడాన్ని కొందరు టిడిపి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట.
మరోవైపు హరికృష్ణ తన సమైక్యవాదం ఆత్మావిష్కరణ అని చెప్పారని, దానికి పార్టీతో సంబంధం లేదని ఇంకొందరు చెబుతున్నారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే అంటున్నారు. అదే సమయంలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించిన హరికృష్ణ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారంటున్నారు. తమ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో పాటు సీమాంధ్ర ప్రజల న్యాయం కోసం ఉద్యమిస్తుందని చెప్పారు.
నిర్ణయంలో మార్పులేదు: ఎర్రబెల్లి
తెలంగాణపై తెలుగుదేశం పార్టీ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని టిటిడిపి ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తెలంగాణకు తాము అనుకూలమని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే స్వయంగా చెప్పారన్నారు. హరికృష్ణది వ్యక్తిగత అభిప్రాయమేనని అన్నారు.