విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్తత, దెబ్బలు తినొద్దని అశోక్బాబు
సీమాంధ్ర ఉద్యోగులకు నిరసన తెలిపేందుకు విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ వచ్చారు. ఈ సమయంలో తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా, పరకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా సీమాంధ్ర ఉద్యోగులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.
సమైక్యవాదుల దీక్షలో పాల్గొన్న పరకాల ప్రభాకర్ విభజన కుట్రను అడ్డుకుంటామని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.
దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోవద్దు: అశోక్ బాబు
సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోవద్దని సమైక్యాంధ్ర ఉద్యమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు అశోక్ బాబు సోమవారం శ్రీకాకుళంలో అన్నారు. సమైక్య ఉద్యమంలో పాలుపంచుకోని నాయకులకు గుర్తింపు లేదన్నారు. వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.
తాము శాంతియుతంగానే ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. సమైక్యాంధ్ర కోసం పార్టీ పెట్టే ఉద్దేశ్యం తమకు లేదని, ఎవరైనా పెడితే మద్దతిస్తామన్నారు. ఎస్మాలకు, భస్మాలకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు.