చీల్చుతారా? జగన్ దీక్ష చేస్తానంటే వద్దన్నా: విజయమ్మ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ విజయమ్మ ఈ రోజు గుంటూరులో ఆమరణ దీక్షకు కూర్చున్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం దీక్ష ప్రారంభించిన విజయమ్మ మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ రాజేసిన మంటలతో రాష్ట్రం రగిలిపోతోందన్నారు. వైయస్ కన్న కలలు కల్లలైపోయాయన్నారు.
వైయస్ ఉండి ఉంటే ఇలా రాష్ట్రం మంటల్లో చిక్కుకొని ఉండకపోయేదన్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయనప్పుడు విభజన సరికాదన్నారు. సీమాంధ్రకు వస్తున్న తెలంగాణ ప్రాంతం వారికి ఎవరు ఎలాంటి హానీ చేయవద్దని ఆమె సమైక్యవాదులకు విజ్ఞప్తి చేశారు. వైయస్ నాడు మూడు ప్రాంతాలను సమానంగా ప్రేమించి, సమానంగా అభివృద్ధి చేశారన్నారు. ఇప్పుడు కాంగ్రెసు ఓట్లు, సీట్లు ప్రాతిపతికన రాష్ట్రాన్ని చీల్చిందన్నారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయం సరికాదన్నారు. ఏకపక్ష నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని ఓ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు. సీమాంధ్రుల భయాలకు కేంద్రం ఏం హామీ ఇచ్చిందన్నారు. నేటి పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజధాని కోసమంటూ కాకి లెక్కలు చెబుతున్నారని విమర్శించారు.
ప్యాకేజీ ఇవ్వాలని బాబు అర్థంపర్థం లేని డైలాగులు చెబుతున్నారన్నారు. బాబు లేఖ ఇచ్చాకనే విభజన నిర్ణయం తీసుకున్నారన్నారు. మనం శాంతియుతంగా ముందుకు వెళ్దామన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని తాము ఇడుపులపాయ ప్లీనరీలో తీర్మానం చేశామన్నారు.
జగనే చేద్దామనుకున్నారు కానీ..
తాను జగన్ తరఫున దీక్ష చేస్తున్నానని విజయమ్మ చెప్పారు. మొదట జగనే దీక్ష చేస్తానని చెప్పారని అయితే, ములాకత్లు ఆపుతారని, శాంతిభద్రతల పేరుతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తారని, అడ్డంకులు సృష్టిస్తారని చెప్పి తానే ఆపానని, అందుకే అతని తరఫున తాను దీక్ష చేస్తున్నానని చెప్పారు. జగన్ జైల్లో ఉన్నా ప్రజల కోసమే ఆలోచిస్తున్నారన్నారు. విభజన తప్పకపోతే ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చేయాలనేదే జగన్ కోరిక అన్నారు.