విభజన: చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర
పార్టీ భవితవ్యం, మనుగడ, కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టడంతో పాటు 2014లో పార్టీని అధికారంలోకి తేవాలనే లక్ష్యాలతో ఈ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. చాలాకాలం పాటు కలిసి వున్న రాష్ట్రాన్ని విడదీయాలంటే ప్రభుత్వ పరంగా చేయాల్సిన కసరత్తు, లోటుపాట్లను చంద్రబాబు విశ్లేషించారు. దీంతో పాటు విభజన ఎలా జరగాలనే దానిపై కూడా అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా 60 ఏళ్ల పాటు కలిసి వున్న రాష్ట్రాన్ని విడదీయాలంటే ప్రభుత్వం తరపున ఒక కమిటీని వేయాల్సిన కనీస ఇంగిత జ్ఝానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించలేదని ఆయన విమర్శించారు.
తమ పార్టీ విభజనకు ఏ మాత్రం వ్యతిరేకం కాదని చెబుతూనే, విభజన తీరును తప్పు పడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కసరత్తును ముమ్మరం చేశారు. ఇరు ప్రాంతాల్లో నెలకొన్న బలమైన సెంటిమెంట్లను ఉపయోగించుకుని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తూనే తమ పార్టీని అంతమొందించాలని కుట్ర పన్నుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రజలకు వివరించనున్నారు.
తెలంగాణ అటు సీమాంధ్ర ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ వారిని బాసటగా నిలిచేందుకు ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు ప్రజలకు వివరించనున్నారు. పార్టీ క్యాడర్ను కాపాడుకుని వచ్చే ఎన్నికలకు సంసిద్ధం చేయాలనే ఆలోచన ఈ యాత్రలో ఇమిడి ఉంది. కాంగ్రెస్ విభజన పక్రియను ప్రకటించినప్పుడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను తెలియజేస్తే వారి భాగస్వామ్యంతో ప్రకటించి వుంటే చాలా మంచి అభిప్రాయం వుండేదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు.