ఎవరి కోసం టి: శైలజానాథ్, అడుక్కునే పరిస్థితి: ఏరాసు
"విభజన వల్ల పాతసమస్యలు పరిష్కారం కావు. కొత్త సమస్యలు అనేకం తలెత్తుతాయి'' అని చెప్పినట్లు మంత్రి సాకే శైలజానాథ్ తెలిపారు. "విభజన తెలుగు వారి జీవితాలకు, తెలుగు వైభవానికి చేటు తెస్తుందని చెప్పాం. విద్య, వైద్య, ఉపాధి కల్పన వంటివన్నీ కేంద్రీకృతమైన హైదరాబాద్ గురించి పూర్తిస్థాయిలో చర్చించాం'' అని తెలిపారు. విభజన వల్ల తలెత్తే నీటి సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్న వాదనలను తోసిపుచ్చారు.
"కావేరీ జలాల పంపిణీ వివాదం వందేళ్లుగా ఉంది. సాక్షాత్తూ ప్రధాని జోక్యం చేసుకుని నీళ్లు విడుదల చేయాలని కోరినా పట్టించుకున్న పరిస్థితి లేదు. కర్ణాటకలోని తుంగభద్ర నుంచి మా అనంతపురం జిల్లాకు నీళ్లు రావడంలేదు. ఏమీకాకముందే హైదరాబాద్లో మీరు ఉండొద్దు, వెళ్లాల్సిందే అని చెబుతున్నారు. ఇక తర్వాత పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. కమిటీ సభ్యులను రాష్ట్రానికి ఆహ్వానించామని తెలిపారు.
రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా అడుక్కుని తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కమిటీకి చెప్పామని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి తెలిపారు. రాయలసీమకు చెందిన సమస్యలను ఎలా పరిష్కరిస్తారని అడిగామని, రాయలసీమ ఎడారిగా మారుతుందనేది వాస్తవమని, శ్రీశైలం ప్రాజెక్టు కింద 20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, ప్రాజెక్టుకు కుడివైపున ఏడు, ఎడమవైపున ఏడు విద్యుత్ జనరేటర్లు ఉన్నాయని, విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్కు లోటు ఉంటుంది కాబట్టి 830 అడుగుల నీటి మట్టం నుంచే విద్యుదుత్పత్తి చేస్తారని, దాని వల్ల మేమూ చేయాల్సి ఉంటుందని అన్నారు.
కానీ నీటి మట్టం 855 అడుగులు ఉంటే తప్ప బ్యాక్వాటర్పై నిర్మించుకున్న ప్రాజెక్టులకు నీళ్లు అందవన్నారు. దీంతో సీమ బిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమైక్యంగా ఉంటేనే తమకు బతుకన్నారు. రాయల తెలంగాణ గురించి ప్రస్తావించగా... అరిటాకు, ముల్లు నానుడిలాగా... నష్టపోయేది రాయలసీమే అన్నారు. కృష్ణా జలాల పంపిణీ, రాష్ట్రాభివృద్ధి, రాజధాని అభివృద్ధిలో సీమాంధ్ర ప్రజల పాత్ర గురించి కమిటీకి చెప్పినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.