అక్కడ దరిద్రదేవతకు ఉత్సవం... ఎందుకో తెలుసా!
ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు వర్షాభావ పరిస్థితులతో కరువు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ జెట్టక్క ఉత్సవంలో దరిద్ర దేవతని సాగనంపి వర్షాలు కురవాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
సాంప్రదాయ జెట్టక్క ఉత్సవం
ఈ తరతరాల సాంప్రదాయ జెట్టక్క ఉత్సవం వివరాలలోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వర్షాల కోసం గ్రామస్తులు ఓ ఆసక్తికర పని చేశారు. వర్షాల కోసం దరిద్ర దేవతను ఊరి నుంచి సాగనంపారు. గ్రామంలో దరిద్రం, అశుభాలు తొలగిపోయి, సంపదలు చేకూరాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన గ్రామస్తులు జెట్టక్క ఉత్సవంలో ప్రత్యేక పూజలు చేశారు.

పాత చీపుర్లు, పనికిరాని వస్తువులతో జెట్టక్క ఉత్సవం
ఉదయం నుంచి పాత చీపుర్లు, పనికిరాని వస్తువులను సేకరించి, డప్పు చప్పుళ్ళు, హారతులు, సంప్రదాయం నృత్యాలతో ఊరేగింపుగా గ్రామ చివరి వరకు తీసుకువెళ్లారు. ఇలా ఈ ఉత్సవం నిర్వహించి దరిద్ర దేవత గ్రామాన్ని వదిలి వెళ్లాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని వారు కోరుకున్నారు. రైతులు మంచి వర్షాలు కురిసి పాడి పంటలతో, సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
పూర్వీకుల ఆచారాలను కొనసాగించడంలో భాగంగా ఈ దరిద్ర దేవతకు వీడ్కోలు
గ్రామంలో ఐశ్వర్యం వెల్లువెత్తాలని వారు సామూహిక పూజలు చేశారు. ఎంతోకాలంగా ఉన్న పూర్వీకుల ఆచారాలను కొనసాగించడంలో భాగంగా ఈ దరిద్ర దేవతకు ఉత్సవాన్ని నిర్వహించి, ఊరి నుంచి సాగనంపారు. ఈ ఉత్సవం తర్వాత వర్షాలు బాగా కురుస్తాయని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి సాంప్రదాయ ఉత్సవాలు గ్రామీణ సంస్కృతిని కాపాడడం తో పాటు, సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అంటున్నారు.
ఆసక్తికరంగా సాగిన జెట్టక్క ఉత్సవం
ఈ ఉత్సవం ద్వారా రుద్రంగి గ్రామస్తులు ప్రకృతి ప్రసాదాలు, ఆర్థిక సంపదలు పొందాలని భావిస్తున్నారు. ఏది ఏమైనా అత్యంత ఆసక్తికరంగా సాగిన జెట్టక్క ఉత్సవం గ్రామస్తులంతా ఉత్సాహంగా నిర్వహించారు. వర్షాలు కురుస్తాయని, అందరూ సంతోషంగా ఉంటామని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications