హరికృష్ణ యాత్ర: వైయస్ జగన్కు లాభమా, నష్టమా?

హరికృష్ణ పర్యటన వల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోతుందని, సీమాంధ్రలో ప్రజలు టిడిపికి వ్యతిరేకమవుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అంచనా వేసుకుంటున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వల్లనే రాష్ట్ర విభజన నిర్ణయం వచ్చిందనే తమ వాదనకు హరికృష్ణ వాదన మరింత బలం చేకూరుస్తుందని, దాంతో చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, హరికృష్ణ విషయంలో చంద్రబాబు అనుకున్నదే జరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయాన్ని సమర్థిస్తూ హరికృష్ణ మాట్లాడిన తర్వాత చెప్పాపెట్టకుండా ఇతర తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు విభజనను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఆ విషయం హరికృష్ణకు నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్పారని అంటున్నారు. దీంతో హరికృష్ణ ఆగ్రహానికి గురై పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా సమైక్య నినాదాన్ని అందుకుని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని అంటున్నారు.
చంద్రబాబు నాయుడిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న హరికృష్ణ దీన్ని అవకాశంగా తీసుకుని సీమాంధ్రలో తన బలాన్ని సమీకరించుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన పార్టీ కూడా పెట్టవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఆయన పార్టీ పెడితే జగన్ గారె నేతిలో పడినట్లేననే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓట్లు సీమాంధ్రలో చీలి తమకు లాభం చేకూరుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంచనాకు వస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే, తెలుగుదేశం పార్టీ అంచనాలు మరో విధంగా ఉన్నాయి. హరికృష్ణ సమైక్య నినాదంతో ప్రజల్లోకి వెళ్తే సమైక్యాంధ్రను కోరుకుంటున్న ఓట్లను చీలుస్తారని, దానివల్ల జగన్ నష్టపోతారని తెలుగుదేశం పార్టీ నాయకులు అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, హరికృష్ణ రెండు పార్టీల ఓట్లనూ చీల్చవచ్చుననే అంచనా కూడా సాగుతోంది. ఏమైనా, హరికృష్ణ పార్టీ పెడుతారా, చంద్రబాబుపై సమరం ప్రకటిస్తారా అనేది ఇంకా తేలాల్సే ఉంది.












Click it and Unblock the Notifications