సమన్యాయమంటే స్కేల్తో కోస్తారా?: శైలజానాథ్ ఎద్దేవా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, తెలుగుదేశం పార్టీ విభజన విషయంలో సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయని, సమన్యాయం అంటే స్కెల్ పెట్టి కోస్తారా? అంటూ మంత్రి శైలజానాథ్ శుక్రవారం ఎద్దేవా చేశారు. సీమాంధ్ర ప్రజాస్వామిక పోరాటానికి తమ మద్దతు ఉందని చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు మాత్రమే సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారన్నారు.
సమైక్యవాదాలు శాసన సభలో విభజన తీర్మానాన్ని ఓడించాలని కోరారు. తెలంగాణ తీర్మానం ఓడించేందుకు అన్ని పార్టీలు సహకరించాలన్నారు. ఇందుకోసం అధినేతలపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. తాము ఎంత కష్టమొచ్చినా కాంగ్రెసు పార్టీతోనే ఉంటామని, ప్రాంతం విషయానికి వచ్చేసరికి నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, అందుకే అధిష్టానానికి చెబుతున్నామన్నారు. విభజన నిర్ణయం రాష్ట్రానికి, దేశానికి నష్టమన్నారు.

తెలంగాణపై ఇప్పటి వరకు పార్టీయే నిర్ణయం తీసుకుందని, కేంద్రం తీసుకోలేదన్నారు. కాబట్టి చంద్రబాబు విభజన విషయంలో తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని కోరారు.
కావూరిని అడ్డుకున్న సమైక్యవాదులు
కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావును సమైక్యవాదులు శ్రీకాళహస్తిలో అడ్డుకున్నారు. దీంతో ఆయన తాను సమైక్యవాదినేనని వివరణ ఇచ్చారు. పార్లమెంటులో గళం వినిపిస్తానని చెప్పారు. అయినప్పటికీ సమైక్యవాదులు రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారు. పోలీసుల రక్షణ మధ్య ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారు.
అనంతలో జగ్గారెడ్డి రూపంలో నిరసన
అనంతపురంలో ఓ వ్యక్తి ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి రూపంలో నిరసన తెలిపారు. తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ జగ్గారెడ్డి సమైక్యగళం వినిపిస్తున్నారని, అలాంటి వారు ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారని ఆయన చెప్పారు. ఆయన జగ్గారెడ్డి వేషధారణలో అందర్నీ ఆకట్టుకున్నారు.












Click it and Unblock the Notifications