విజయమ్మ వీధి డ్రామా, ఇక జగన్ ఇంటి డ్రామా: బొత్స
హైదరాబాద్/ న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వీధి నాటకం ముగిసిందని, ఇక పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఇంటి నాటకం ప్రారంభం కాబోతోందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గుంటూరులో వైయస్ విజయమ్మ దీక్షను విరమించడం, జగన్ రేపటి నుంచి జైలులో దీక్ష ప్రారంభించాలని అనుకోవడంపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విధంగా వ్యాఖ్యానించారు.
జగన్ బయటకు రావడం, కుర్చీ ఎక్కడమే వైయస్సార్ కాంగ్రెసు విధానమని ఆయన వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి అభివృద్ధి, సమైక్యవాదం అవసరం లేదని అన్నారు. దీక్షలంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వీధి నాటకాలకు తెరలేపిందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలకు అభివృద్ధి వద్దని, రాజకీయాలే కావాలని ఆయన అన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఝప్తి చేశారు.

సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల సస్పెన్షన్ బాధాకరమని ఆయన అన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై సస్పెన్షన్ను సోమవారం ఎత్తేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్కు తాను లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఆ పార్లమెంటు సభ్యులకు పార్టీ పట్ల, అధిష్టానం పట్ల అంకిత భావం ఉందని, వారు సీనియర్లూ అనుభవజ్ఝులూ అని ఆయన అన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను వారు వ్యక్తీకరించారని ఆయన అన్నారు. వారి బాధ్యతను వారు నిర్వహించారని అభిప్రాయపడ్డారు.
ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఆర్టీసి కార్మికులు, అధికారులు ఆ మేరకు విజ్ఝప్తి చేశారని ఆయన చెప్పారు. ప్రజల ఇబ్బందులను, కార్మికుల వినతిని దృష్టిలో పెట్టుకుని ఆ విషయాన్ని పరిశీలించేందుకు ఓ ఉన్నత స్థాయి కమిటీని వేస్తామని, ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు బొత్స తెలిపారు.












Click it and Unblock the Notifications