విభజన: ఐటి జెఏసి ఏర్పాటు, టిడిపికి తమ్మినేని గుడ్బై
రాష్ట్రంలో నానాటికి పడిపోతున్న ఐటి రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ఈ జెఏసి ఏర్పడినట్లు చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ అనిశ్చితి కారణంగా ఐటి పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలి పోతుండటంతో ఉన్న కంపెనీలు కూడా తీసేసే పరిస్థితి నెలకొందన్నారు.
ఎనిమిది వేల మంది ఉద్యోగుల నుంచి నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాల కల్పన వరకు ఎదిగిన ఐటి రంగం ఇప్పుడు క్రమేణా డీలాపడిపోతుందన్నారు. సమస్య పరిష్కారానికి చర్య తీసుకోవాల్సిందిగా అవసరమైతే తాము ఆంటోని కమిటితో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తామన్నారు.
మరోవైపు, సీమాంధ్ర జిల్లాల గనులు, భూగర్భ జలవనరుల శాఖ అధఇకారులు గుంటూరులో సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం నుండి విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేయాలని తీర్మానం చేశారు.
టిడిపికి తమ్మినేని గుడ్ బై
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని టిడిపి కాపాడలేకపోయిందని, ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా ఉందని, అందుకే తాను టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఆయన జగన్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.