దిగ్విజయ్ పిలుపు: ఢిల్లీకి కెసిఆర్, విజయశాంతి
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యుడు కె.చంద్రశేఖర్రావు ఆదివారం రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట పార్టీ నేతలు కడియం శ్రీహరి, జి.జగదీశ్రెడ్డి ఉన్నారు. తెలంగాణకు అనుకూలంగా యూపీఏ సమన్వయ కమిటీ, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి.
తాజా రాజకీయ పరిణామాలు నేపథ్యం, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న క్రమంలో ఆయన హస్తిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కెసిఆర్ను ఫోన్ చేసి దిగ్విజయ్ సింగ్ ఢిల్లీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆహార భద్రతా బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన కెసిఆర్ను కోరినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన ఢిల్లీకి వచ్చినట్లు సమాచారం.
కాగా, విజయశాంతికి కూడా దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. తెరాస నుంచి ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆహార భద్రత బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన విజయశాంతిని కూడా కోరినట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెసులో చేరుతారనే ప్రచారం ఇప్పటికే ముమ్మరంగా సాగుతోంది. పలువురు కాంగ్రెసు అదిష్టానం పెద్దలను కూడా ఆమె కలిశారు. కాగా, తెరాసలో చేరిన పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, వివేక్ కూడా ఆహార భద్రతా బిల్లుకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
సిపిఎం వైఖరి ఎందుకు మారింది: వినోద్
చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఇవ్వాలని, కానీ తమను బూచిగా చూపవద్దని తెరాస పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి వినోద్ కుమార్ సిపిఎంను ఉద్దేశించి అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను కోరేవారమే గానీ, తెలంగాణకు వ్యతిరేకం కాదని మాట్లాడిన సిపిఎం వైఖరి ఇప్పుడు ఎందుకు మారిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.