పెళ్లి పీటల మీదికి వెళ్తూ వరుడు పరారయ్యాడు
ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా మలాస మండలం మొగిలిపాడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. దీంతో ప్రియురాలు ప్రియుడు ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది. గ్రామానికి చెందిన మహిళా సంఘాల కార్యకర్తలు, పెద్దలు ఆమెకు అండగా నిలిచారు. ప్రియుడు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని చిత్తగించారు.
వివరాలు ఇలా ఉన్నాయి - జలంద్రపాత్రో తల్లిదండ్రులతో కలిసి పదేళ్ల క్రితం మొగిలిపాడు గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. డిగ్రీ పూర్తి చేసిన నాలుగేళ్ల క్రితం అదే గ్రామంలోని సాయి సరస్వతి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. అప్పటికే ఆ గ్రామానికి చెందిన బర్ల పద్మ ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వారిద్దరికి అలా పరిచయమై, ప్రేమకు దారి తీసింది.
పెళ్లి చేసుకుందామని అనుకున్న ప్రేయసీప్రియులు కలిసి అన్నవరం, కైలాసగిరి వంటి ప్రాంతాలకు తీర్థయాత్రకు కూడా వెళ్లారు. వీరి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన జలంద్రపాత్రో గడువులు పెడుతూ వస్తున్నాడు. దీంతో గత ఏప్రిల్ 21వ తేదీన గ్రామపెద్దల సమక్షంలో పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.
ఆదివారంనాడు మొగిలిపాడులోని వినాయకుడి గుడిలో ఉదయం 11 గంటలకు వారిద్దరికీ పెళ్లి జరగాల్సి ఉండింది. పద్మ, జలంద్ర పెద్దలతో కలిసి గుడికి వెళ్తుండగా వరుడు బైక్పై పరారయ్యాడు. దీనిపై పద్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.