ముంబై రేప్: మరో ఇద్దరు మహిళలనూ రేప్ చేశారు
ముంబై: మహిళా ఫొటో జర్నిలిస్టులపై అత్యాచారం చేసిన ఐదుగురు నిందితులు గతంలో కూడా ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్లు విచారణ తేలింది. గత ఆరు నెలల కాలంలో వారు మరో ఇద్దరు మహిళలపై అదే శక్తి మిల్స్లో అత్యాచారం చేశారు. మరో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
శక్తి మిల్స్ ఆవరణలోకి ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలను ఏరుకోవడానికి వచ్చిన ఓ మహిళపై వారు అత్యాచారం జరిపారు. ఓ సెక్స్ వర్కర్ను తీసుకుని వచ్చి లైంగికంగా అనుభవించి, డబ్బులు ఇవ్వకుండా పంపించేశారు. ప్రైవసీ కోసం శక్తి మిల్స్లోకి తన బాయ్ ఫ్రెండ్తో వచ్చిన ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
అయితే, సంఘటనలు ఏవీ ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. ఐదుగురు కూడా శక్తి మిల్స్ ఆవరణలో కూర్చుని పత్తాలు ఆడుతుంటారని, అక్కడికి ఎవరైనా వస్తే వారిని బెదిరించి దోచుకోవడం, వారిపై అత్యాచారం చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడుతూ వస్తున్నారని నేర పరిశోధక విభాగం అధికారులు చెబుతున్నారు
ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం కేసులో సాక్ష్యాధారాలను సేకరించడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాసిం షేక్, చంద్ సత్తార్ షేక్,సిరాజ్ రెహ్మాన్ అనే ముగ్గురు నిందితులతో కలిసి పత్తాలు ఆడే ఓ వ్యక్తి వాంగ్మూలాన్ని సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.