ఊరట: జగన్తో ఉండేందుకు భారతికి అనుమతి
హైదరాబాద్: ఆస్పత్రిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉండేందుకు ఆయన భార్య వైయస్ భారతికి సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు జగన్తో ఉండేందుకు భారతి ఉండవచ్చునని కోర్టు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భారతి జగన్కు సహాయంగా ఉండవచ్చునని కోర్టు తెలిపింది. జగన్కు భారతి తినుబండారాలను కూడా తీసుకుని వెళ్లవచ్చునని కోర్టు తెలిపింది.
జగన్కు సహాయంగా ఉండేందుకు తమను అనుమతించాలని వైయస్ విజయమ్మ, భారతి దాఖలు చేసుకున్న మెమోను తొలుత సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత భార్యగా తనను జగన్తో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని భారతి వ్యక్తిగత విజ్ఝప్తి చేశారు. భారతి విజ్ఝప్తిపై కోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెలువరించింది. జగన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యే వరకు భారతి ఆయనతో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వైయస్ జగన్ కుటుంబానికి ఊరట లభించింది. భారతి విజ్ఝప్తికి సిబిఐ కూడా అభ్యంతరం తెలపలేదు.

సమైక్యాంధ్రకు మద్దతుగా ఉస్మానియా ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పారటీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెల్త్ బులిటెన్ను వైద్యులు శనివారం ఉదయం విడుదల చేశారు. జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. రక్తపోటు, బీపీ షుగర్ లెవల్స్ తగ్గాయని, తక్షణమే జగన్కు ఫ్ల్యూయిడ్ ఎక్కించాలని బులిటెన్లో అన్నారు.
అయితే వైద్యానికి జగన్ సహకరించడం లేదని వైద్యులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర కోసం చంచల్గూడా జైల్లో జగన్ చేపట్టిన దీక్షను పోలీసులు గురువారం రాత్రి భగ్నం చేసి ఉస్మానియాకు తరలించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శుక్రవారం రాత్రి ఆయనను ఉస్మానియా ఆస్పత్రి నుంచి నిమ్స్కు తరలించారు.












Click it and Unblock the Notifications