ఆరాంగా నడిచాడు: జగన్ దీక్షపై పొన్నం సెటైర్లు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిరాహారదీక్షపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఐదు రోజులు చంచల్గుడా జైలులో ఐదు రోజులు దీక్ష చేసిన తర్వాత కూడా ఉస్మానియా ఆస్పత్రిలోకి జగన్ ఆరాంగా నడిచి వచ్చాడని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ దీక్ష ఓ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ను జైలు నుంచి ఉస్మానియాకు, అక్కడి నుంచి నిమ్స్కు తరలించారని, ఆయన భార్యకు జగన్ వద్దకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారని, ఇప్పుడు జగన్కు ఫ్లూయిడ్స్ ఎక్కించారని, ఇక అంతా అయిపోయిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. షర్మిల పాదయాత్ర చేశారని, విజయమ్మ దీక్ష చేశారని, జగన్ దీక్ష అయిపోయిందని, షర్మిల బస్సు యాత్ర చేస్తారని, ఆ తర్వాత విమాన యాత్ర చేసి అమెరికా వెళ్లిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.
వైయస్ జగన్ను తాము ఓ రోజు కూడా తెలంగాణవాది అనుకోలేదని, పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకున్నప్పుడు జగన్ ఏమిటో తేలిపోయిందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వైయస్సార్ తెలుగుదేశం పార్టీగా పిలుచుకుంటే సరిపోతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మైసురారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వంటి తెలుగుదేశం నాయకులే వైయస్ జగన్కు సన్నిహితంగా ఉన్నారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఆత్మగౌరవ యాత్రపై కూడా ఆయన మండిపడ్డారు. తెలంగాణలో వేయి మంది విద్యార్థులు మరణించినా చంద్రబాబు స్పందించలేదని, ఇప్పుడు 30 రోజులు ఆందోళన జరుగుతుంటే సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందని అంటున్నారని ఆయన అన్నారు. సీమాంధ్రది న్యాయమంటే తెలంగాణది అన్యాయమనే అర్థమే కదా, చంద్రబాబు ఆ రకమైన వివక్షను చూపుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణలో 42 రోజుల పాటు సకల జనుల సమ్మె జరిగితే, వేయి మంది యువకులు అత్మబలిదానం చేసుకుంటే ఆనాడు చంద్రబాబు నోరు మూగబోయిందా, ఎందుకు మాట్లాడలేదని ఆయన అడిగారు. సీమాంధ్రలో ఉద్యమాలు ప్రచారం చేస్తున్నంత స్థాయిలో లేవని ఆయన అన్నారు. తిరుపతికి ఎవరైనా ఆరంగా పోయి వస్తున్నారని ఆయన అన్నారు.