తెలంగాణ: చంద్రబాబు విదర్భ మెలిక, షిండేకు ప్రశ్న
తెలంగాణపై 20 రోజుల్లోగా నోట్ పెడతామని షిండే చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. నోట్ పెట్టే ముందు విభజన సమస్యల గురించి ఆలోచించరా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై 20 రోజుల్లో కేబినెట్ నోట్ పెడతామని షిండే అంటున్నారని గుర్తు చేస్తూ సీమాంధ్ర ఆందోళనలను పట్టించుకోరా అని అడిగారు. సాగు, తాగునీరు రావని, ఉద్యోగాలు దొరకవని సీమాంధ్ర ప్రజలు ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు.
తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి అవినీతిమయం చేశారని ఆరోపించారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ పెట్టిన ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు. రాష్ట్ర విభజనకు కారణం వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆయన అన్నారు.
నాపైనా దాడి చేయించారు
విజయనగరంలో గతంలో తనపై కూడా దాడి చేయించారని ఆయన ఆరోపించారు. విజయనగరంలో దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. బొత్స కుటుంబ సభ్యులందరికీ పదవులు ఉన్నాయని, యువత ఉద్యోగాలు రావని బాధపడుతున్నారని, ఈ బాధలు బొత్సకు పట్టవా అని చంద్రబాబు అన్నారు.
సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తెలుగువారికి ఎప్పుడు కష్టం వచ్చినా తమ పార్టీ అండగా నిలిచిందని చెప్పుకున్నారు. ఎన్టీఆర్కు ఎన్టీఆరే పోటీ తప్ప మరెవరూ కారని ఆయన అన్నారు. తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.
ఇటలీలో పుట్టినందు వల్ల కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి చరిత్ర తెలియదని చంద్రబాబు అన్నారు. రాజకీయాల కోసం కాంగ్రెసు పార్టీ తెలుగువారి మధ్య చిచ్చు పెట్టిందని ఆయన విమర్శించారు.