థియేటర్లు వెనక్కి: రామ్ చరణ్ 'తుఫాన్'కు విభజన సెగ
హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన జంజీర్/ తుఫాన్ సినిమాకు విభజన సెగ పెద్ద యెత్తునే తాకేట్లు కనిపిస్తోంది. సినిమా విడుదలకు భద్రత కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ సజావుగా ఆ సినిమా నడిచేట్లు కనిపించడం లేదు. తుఫాన్ సినిమా శుక్రవారం 6వ తేదీన విడుదల కానుంది. దీంతో అటు సమైక్య సెగతో పాటు ఇటు తెలంగాణ సెగ కూడా ఆ సినిమాను చుట్టుముట్టే పరిస్థితి ఉంది. సీమాంధ్రలోని తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి వంటి నగరాల్లో తుఫాన్ సినిమా విడుదల కావడం లేదని, దాన్ని ప్రదర్శించడానికి థియేటర్ల యజమానులు నిరాకరిస్తున్నారని సమాచారం అందుతోంది. అనంతపురంలో ఒక్క థియేటర్లో కూడా ఈ సినిమా విడుదల కావడం లేదని అంటున్నారు.
తుఫాన్ సినిమా విడుదలను అడ్డుకుంటామని సమైక్యవాదులు హెచ్చరించారు. పలు చోట్ల సమైక్యవాదులు సినిమా పోస్టర్లను చించేశారు. తిరుపతిలో రామ్ చరణ్ తేజ తాజా సినిమా తుఫాన్ను ప్రదర్శించవద్దని సమైక్యవాదులు థియేటర్ల యాజమాన్యాలను కోరారు. ప్రదర్శిస్తే మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. దీంతో జిల్లాలోని పలమనేరు, చిత్తూరు తదితర ప్రాంతాల నుండి సినిమా ప్రదర్శనకు థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాలేదని తెలుస్తోంది. విజయనగరంలో తుఫాన్ సినిమా పోస్టర్లను చించేశారు.
తెలంగాణలో కూడా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ సినిమాకు అడ్డంకులు తప్పేట్లు లేవు. కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు, నటుడు రాంచరణ్ నటించిన 'తుఫాన్'(తెలుగు)సినిమాను అడ్డుకుని తీరుతామని నిజామాబాద్ జిల్లా విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్ వద్ద తుఫాన్ సినిమా పోస్టర్లను తగలబెట్టారు. గతంలో సామాజిక తెలంగాణ అంటూ ప్రజల వద్దకు వచ్చిన చిరంజీవి తర్వాత మాటమార్చి ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ద్రోహిగా మారిన చిరంజీవి కుటుంబ సభ్యులు నటించే సినిమాలను అడ్డుకుంటామన్నారు.
పైగా, ఈ నెల 7వ తేదీన హైదరాబాదులో సమైక్య నినాదంతో ఎపిఎన్జీవోల సభ జరగనుంది. హైదరాబాద్లో రేపు మాత్రమే తుఫాన్ సినిమా ప్రదర్శన ఉంటుందని తెలుస్తోంది. శనివారం ఏడో తేదీన సినిమా నడిచే అవకాశం లేదు. ఎపి ఎన్జీవోల సభ కారణంగా తలెత్తే పరిణామాలు కూడా తుఫాన్ సినిమాపై పడే అవకాశం ఉంది.
చిరంజీవి సమైక్యవాదాన్ని ఎత్తుకోనప్పటికీ కాంగ్రెసు అధిష్టానం విభజన నిర్ణయాన్ని అంగీకరిస్తూ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో సమైక్యవాదులు చిరంజీవిపై ఆగ్రహంతో ఉన్నారు. సమైక్యవాద నినాదంతో చిరంజీవి తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. దీంతో చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలకు ఇరు ప్రాంతాల్లోనూ చిక్కులు తప్పేట్లు లేవు.
రాష్ట్ర విభజన కారణంగానే జంజీర్ కన్నా ముందు విడుదల కావాల్సిన రామ్ చరణ్ తేజ ఎవడు సినిమా విడుదల వాయిదా పడిందని అంటున్నారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా అత్తారంటికి దారేది సినిమా నిర్మాణం పూర్తయినా సానుకూల పరిస్థితి కోసం ఎదురు చూస్తోంది. జంజీర్ హిందీ వెర్షన్తో పాటు తెలుగు వెర్షన్ తుఫాన్ సినిమాను కూడా విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.