కిరణ్ రెడ్డి ఉద్వాసనకు తెలంగాణ ఎంపిల యత్నం
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని తొలగించాలని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వారు బుధవారం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరారు. సీమాంధ్రలో తెలంగాణ వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నారని, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.
కిరణ్ కుమార్ రెడ్డిపై వి. హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి తెలంగాణ ఎంపీలు విభజనను ఆపడానికి కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల సహకారంతో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ.

సీమాంధ్రలో ఉద్యమానికి కిరణ్ కుమార్ రెడ్డి ఆజ్యం పోస్తున్నారని, కిరణ్ కుమార్ రెడ్డి అసత్యాలను, అర్థ సత్యాలను ప్రచారం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ఎపిఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్జీవోల శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరించారని వారు సుశీల్ కుమార్ షిండే దృష్టికి తీసుకుని వెళ్లినట్లు సమాచారం.
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిస్తే ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతాయని వారంటున్నారు. తెలంగాణ ప్రక్రియ సాఫీగా సాగిపోవడానికి సహకరించే నాయకుడిని ముఖ్యమంత్రిగా తేవాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications