టిడిపి ఎంపీల గాంధీగిరి: ఉండవల్లి స్పీచ్కి టినేతల అడ్డు
న్యూఢిల్లీ: లోకసభ నుండి సస్పెండైన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మూడో రోజైన గురువారం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీగిరితో నిరసన తెలిపారు. విభజనపై నిర్ణయం తీసుకుంటున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఇతర కాంగ్రెసు నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ఎంపీలు శివ ప్రసాద్, కొణకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సిఎం రమేష్ గాంధీగిరితో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాడు మహాత్మా గాంధీని, సర్దార్ వల్లభాయ్ పటేల్ను, మౌలానా అబుల్ కలాం ఆజాద్లను చూశామని, ఇప్పుడు సోనియాను, గులాం నబీ ఆజాద్ను, అహ్మద్ పటేల్లను చూస్తున్నామని, వీరికి బుద్ధి ప్రసాదించాలని ఆ మహానుభావులను కోరుకుంటున్నామన్నారు. తాము శాంతియుతంగా గాంధీ మార్గంతో నిరసన తెలియజేస్తున్నామన్నారు. సీమాంధ్రులకు న్యాయం కావాలని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వారు డిమాండ్ చేశారు.
ఉండవల్లి ప్రసంగానికి టి కాంగ్రెస్ ఎంపిలు అడ్డు
లోకసభలో రాజమండ్రి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగిస్తుండగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు అడ్డుకున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలను సభలో ఉండవల్లి ప్రస్తావిస్తున్న సమయంలో వారు అడ్డుకున్నారు.
రాజ్యసభలో సిఎం రమేష్
రాజ్యసభలో టిడిపి ఎంపి సిఎం రమేష్ కేంద్ర ప్రభుత్వం పైన నిప్పులు చెరిగారు. సీమాంధ్రలో 37 రోజులుగా ప్రజలు రోడ్ల పైకి వస్తున్నారని, పదమూడు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని, అక్కడ పర్యటిస్తే ప్రజల బాధలు తెలుస్తాయని, సీమాంధ్రుల ఆందోళనలను కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓ వైపు కమిటీ అంటూనే మరోవైపు విభజన ప్రక్రియ వేగవంతమని చెప్పడమేమిటని ప్రశ్నించారు. కాగా, విభజనను సమాజ్వాది పార్టీ వ్యతిరేకించింది.