పోటీకి జగ్గారెడ్డి దూరం?: అమరవీరుల ఫ్యామిలికీ సీటు

తన స్థానంలో తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న అమరవీరుల కుటుంబాలలో ఓ కుటుంబాన్ని బరిలో దింపాలని జగ్గారెడ్డి భావిస్తున్నారట. అతను మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణ కోసం ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
ఆ తర్వాత దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కాంగ్రెసు వైపుకు వచ్చారు. మొన్నటి వరకు తెలంగాణవాదిగా ఉన్న జగ్గా రెడ్డి ఈ మధ్య సమైక్యవాదం బలంగా వినిపిస్తున్నారు. తెలంగాణ వస్తే తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు.
ఇప్పుడు కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రకటించడంతో ఆయన పోటీకి దూరంగా ఉండటమే కాకుండా తన స్థానంలో అమరవీరుల కుటుంబాన్ని బరిలోకి దింపాలని చూస్తున్నారట. ఈ విషయమై తన అనుచరులతో ఆయన చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారు మాత్రం ససేమీరా అంటున్నారట.
అయితే, వారితో చర్చించాక తుది నిర్ణయం తాను అనుకున్నట్లుగా ఉంటే అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. జగ్గా రెడ్డి నిజంగానే పోటీకి దూరంగా ఉంటే అది సంచలన నిర్ణయమే అవుతుంది. అంతేకాకుండా తన స్థానంలో తెలంగాణ అమరవీరుల కుటుంబానికి అవకాశం ఇవ్వడం ద్వారా ఇతర పార్టీలను ఆయన ఇరుకున పెట్టినట్లుగానే భావించవచ్చు.












Click it and Unblock the Notifications