కెసిఆర్ సవాల్: 22న తెలంగాణ స్వాభిమాన్ సదస్సు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఎపిఎన్జీవోలు నిర్వహించిన సభను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో పాటు తెలంగాణ జెఎసి నాయకులు సవాల్గా స్వీకరించినట్లు కనిపిస్తున్నారు. ఈ నెల 22వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ స్వాభిమాన్ పేరుతో తెలంగాణ ఎన్జీవోల సభను తలపెట్టారు. కెసిఆర్ సోమవారంనాడు తెలంగాణ జెఎసి నేతలతో, తెరాస నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఆయన నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 12వ తేదీన జరిగే జెఎసి విస్తృత స్థాయి సమావేశంలో తేదీని, సభా వేదికను నిర్ణయిస్తామని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. అయితే, తేదీనీ వేదికను కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్ని తెలంగాణ జెఎసిలతో కలిపి ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జెఎసిలతో ఈ నెల 12వ తేదీన చర్చిస్తారు. ఆ తర్వాతే తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.
హైదరాబాదులో సదస్సు జరగాల్సిన అవసరం ఉందని అందరూ భావిస్తున్నారని, అందుకు అనుగుణంగానే సదస్సును ఏర్పాటు చేస్తామని కెసిఆర్ అన్నారు. సీమాంధ్ర ఉద్యమం జుగుప్సాకరంగా వ్యవహరించారని కెసిఆర్ అన్నారు. తనను లక్ష తిట్లు తిట్టారని, ఇంకా లక్ష తిట్లయినా తింటాను గానీ లక్ష్యాన్ని చేరేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన అన్నారు. ఎపి ఎన్జీవోల సభ వంటివి తెలంగాణలో లక్ష జరిగాయని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రమే కావాలని ఆయన అన్నారు.
ఏ తెలంగాణ ప్రాంతాలైతే విలీనమైనప్పుడు కలిశాయో వాటితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని, అయితే తెలంగాణ ప్రజలు చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. తెరాస నాయకుడు కె. కేశవరావు నివాసంలో తెరాస, తెలంగాణ జెఎసిల నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఢిల్లీ పరిణామాలను సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. హైదరాబాదుపై ఎటువంటి ఆంక్షలు లేని తెలంగాణ కావాలని తాము కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.