కేసీఆరే కాదు బ్యాంకర్లు కూడా.. రైతులకు తప్పని వేధింపులు: షర్మిల
వైయస్ షర్మిల రైతు ఆవేదన యాత్ర నాలువ రోజు నిర్మల్ జిల్లాలో ప్రారంభమైంది. దిల్వర్పూర్ మండలం కాల్వ తండాలో బానోత్ అంబర్ సింగ్, సారంగపూర్ మండలంలోని రనపుర్ తండాలో రాతోడ్ శేషురావు, మామ్ డ మండలం తాండ్ర గ్రామంలో నాయుడు భీమన్న అనే రైతుల కుటుంబాలను పరామర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో రైతులకు అప్పులు పెరిగిపోయాయని వివరించారు. రైతులకు బ్యాంకుల్లో కొత్త రుణాలు రాకపోవడంతో బయట అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారు. బ్యాంకు అధికారులు కూడా అప్పులు తీర్చాలని రైతులను వేదిస్తున్నారని రైతు కుటుంబాలు చెబుతున్నాయి. రైతు ఆవేదన యాత్రలో ఆత్మహత్యలకు గల కారణాలు తెలుసుకుంటుంటే కంటి వెంట నీరు ఆగడం లేదు. రైతులు అందరూ కనీస సంపాదన లేకపోయినా అప్పులు తీర్చేందుకే వరి పంట వేస్తున్నారు. అప్పులు తీర్చలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
వేధింపులు తాళలేక
అంబర్ సింగ్ అనే రైతు కుటుంబంపై బ్యాంకు అధికారులే బాధించారు. రైతులపై బ్యాంకు వాళ్లకు కూడా కనికరం లేదు. వరి పంట కొనుగోలు జాప్యం, యాసంగి వరి వేయవద్దని చెప్పడం వల్ల ప్రతీ రోజూ ఇద్దరు, ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి కేసీఆర్ దిగజార్చారు. రైతుల వడ్లు కొనడం కేసీఆర్ కు చేతకాకపోతే సీఎం పదవీకి రాజీనామా చేయాలి. రోజూ ఇద్దరు, ముగ్గరు రైతులను పొట్టన పెట్టుకోవడం భావ్యం కాదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాల ఉసురు కేసీఆర్కు తప్పకుండా తగులుతుంది. ముఖ్యమంత్రి అన్నాక ముందు చూపుతో రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోగలగాలి. ప్రతీ విషయంలోనూ రాజకీయాలు వెతుక్కుని కేసీఆర్ రాజకీయంగా లబ్దీపొందడం కోసం పనిచేస్తున్నాడు. రాష్ట్రంలో రైతులవి ఆత్మహత్యలు కావు కేసీఆర్ చేస్తున్న హత్యలే.కేసీఆర్ కు రుణమాఫీ చేయడం చేతకానప్పుడు ఎందుకు హామీనిచ్చారు. రుణమాఫీ చేసి ఉంటే రైతుల ఆత్మహత్యలు జరిగేవి కాదు.
రూ.25 వేలు జమ
రైతుబంధు పేరుతో ఇస్తున్నది రూ.5000 అయితే ఇన్ పుట్ సబ్సిడీ, యంత్ర లక్ష్మీ, ఎరువులు, విత్తనాల సబ్సిడీలు బంద్ చేసి రూ.25,000 పట్టుకుంటున్నారు. పంట నష్టపోయిన రైతులకు కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కేసీఆర్ ఇవ్వడం లేదు. మద్దతు ధర అంటే రైతులు వేసిన పంటను ప్రభుత్వం భరోసాను కల్పించి కొనుగోలు చేయాలి. వరి పంటకు మద్దతు ధర ఉంది. యాసంగిలో వరి వేయవద్దన్నారంటే రైతు నుంచి భరోసాను కేసీఆర్ లాక్కున్నట్టే. మద్దతు ధర ఉన్న పంటను కొనం అనిచెప్పే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. రైతు వరి పండించడం వరకే ఆయన బాధ్యత, పండించిన వడ్లను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు అని స్పష్టంచేశారు.
పాలించడం రాదు
కేసీఆర్కు పరిపాలన చేతగాక ధర్నాలు, చావుడప్పు, అపాయింట్ మెంట్ లేకుండా డిల్లీకి పోయి డ్రామాలు చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీచేయలేని, వడ్లు కొనుగోలు చేయలేని చేతగాని ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం రా రైస్ ఎన్నైనా కొనుగోలు చేస్తామని చెబుతోంది. అయినా కూడా వరి వేయవద్దని చెబుతున్నాండటే పాలన చేతగాని కేసీఆర్.. రైతుల వరి కొనుగోలు చేయలేని కేసీఆర్ అధికారంలో ఎందుకు ఉన్నట్టు..? కేసీఆర్ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. కేసీఆర్ కుటుంబం తప్ప ఏ కుటుంబం బాగుపడలేదు. మీ కుటుంబం కోసమే సీఎం పదవి అయితే పరిపాలన చేయడం ఎందుకు ఫామ్ హౌస్ లోకి పోయి పడుకోండి. నిరంకుశ పాలనతో ఇంకా ఎంతమంది రైతులను పొట్టన పెట్టుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కేసీఆర్ ఒక్క రూపాయి అయినా సాయం అందజేశారా..? గ్రామాల్లో ఒక్క రైతును కూడా టీఆర్ఎస్ నాయకులు పరామర్శించింది లేదు. ఎక్కడో హర్యానాలో చనిపోయిన రైతులకు రూ.3 లక్షలు మూడు రోజుల్లో అందజేస్తామని కేసీఆర్ అంటున్నారు. మరి మన రైతులవి ప్రాణాలు కాదా..? తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం అందజేయాలి. వడ్లు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేసీఆర్ దే. కేసీఆర్ దిక్కుమాలిన పాలన వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.