శ్వేతనాగు దర్శనం: శివరాత్రి రోజే అద్భుతం.. ప్రత్యేక పూజలు
మహా శివరాత్రి.. శివ భక్తులు ఆ పార్వతీ పరమేశ్వరులను నిష్టగా కొలుస్తున్నారు. ఆ నీలకంఠుడి కృప కోసం జాగారం కూడా చేస్తున్నారు. పిల్ల పాపలతో తమని చక్కగా చూడాలని కోరుతున్నారు. శివుని మెడలో నాగుపాము ఉంటోన్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల నాగేంద్రుడికి కూడా పూజలు చేస్తున్నారు. ఆ జాతులలో శ్వేతనాగు అరుదుగా కనిపిస్తాయి. శివరాత్రి రోజే శ్వేతనాగు కనిపిస్తే.. భక్తుల ఆనందానికి అవధి లేకుండా పోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం శ్వేత నాగు దర్శనం ఇచ్చింది.
జిల్లాలో లక్సెట్టిపేటలో శ్వేత నాగు కనిపించింది. సంతోష్ అనే వ్యక్తి ఇంటి వద్ద కనిపించగా.. జనం భారీగా తరలివచ్చారు. ఆ శ్వేత నాగును చూసి తరించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్వేత నాగు కనిపించడంతో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. శ్వేత నాగును చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చారు. దీంతో ఆ ప్రాంతం ఇసుకవేస్తే రాలనంత జనంతో ఉంది.
జనం పెరిగిపోవడంతో కాలనీ వాసులు స్నేక్ క్యాచర్స్ను పిలిపించారు. వారు పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. ఆ శ్వేత నాగు తిరిగి అడవీ తల్లి ఒడికి వెళ్లిపోయింది. కానీ కాసేపు మాత్రం భక్తుల నుంచి విశేష పూజలను మాత్రం అందుకుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా దర్శనం ఇవ్వడంతో భక్తులు నిష్టగా, ఇష్టంతో కొలిచారు.