సంచలనం: సీఎం జగన్, ఎమ్మెల్యే ఆర్కేపై అట్రాసిటీ కేసుకు అమరావతి దళిత జేఏసీ తీర్మానం -అసైన్డ్ వివాదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూకుంభకోణం కేసులు, అసైన్డ్ భూముల వివాదానికి సంబంధించి సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమరావతికి సంబంధించి ఏ జీవోను ప్రస్తావిస్తూ అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఫిర్యాదు చేశారో, అదే జీవో 41ను గర్హిస్తూ అసైన్డ్, దళిత రైతులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే..
అమరావతిలో దళితులను దగా చేసిన మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ తదితరులు అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే కొద్ది రోజుల కిందట నలుగురు రైతుల పేర్లతో సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, నారాయణలకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. విచారణకు రావాలని ఆదేశించింది. సదరు దర్యాప్తును నిలిపేయాలంటూ బాబు అండ్ కో కోర్టుకు వెళ్లగా స్టే లభించింది. అసైన్డ్ భూముల వివాదంపై సీఐడీ విచారణకు హాజరైన దళిత రైతులు అనూహ్య స్టేట్మెంట్లు ఇచ్చారు. రెడ్డి కులానికి చెందిన ఆర్కే.. కమ్మ కులస్తుడైన చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టడమేంటనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా మంగళవారం మరోసారి అమరావతి దళిత జేఏసీ ఆధ్వర్యంలో అసైన్డ్, దళిత రైతులు సమావేశమై సంచలన తీర్మానాన్ని ఆమోదించారు.

సీఎం, ఎమ్మెల్యేపై కేసులు..
అసైన్డ్ భూముల వివాదానికి సంబంధించి గతంలో సీఐడీ ముందు హాజరైన రైతులు.. తమ భూముల్ని రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చామని, భూముల్ని ఎవరూ లాక్కోలేదని, బెదిరించలేదని స్టేట్మెంట్లు ఇచ్చారు. విచిత్రంగా ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్న నలుగురు రైతుల్లో ఇద్దరు కూడా తాము మోసపోలేదని, ఆర్కే ఫిర్యాదుతో సంబంధం లేదని బాహాటంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే అమరావతి దళిత జేఏసీ మంగళవారం సమావేశమై.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేలపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టాలని తీర్మానించుకుంది.

జీవో 41తో రైతులకు మేలు..
అమరావతి దళిత జేఏసీ ఆధ్వర్యంలో అసైన్డ్, దళిత రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం, ఎమ్మెల్యే ఆర్కేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని తీర్మానించారు. ప్రభుత్వ పెద్దలు ఎవరైనా రాజధాని దళితల హక్కులకు భంగం కలిగిస్తే..వారిపై కూడా అట్రాసిటీ కేసు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. భూముల హక్కులను జీవో 41 కాపాడుతోందని దళిత రైతులు పేర్కొన్నారు. భూ హక్కుల నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వారు ఆరోపించారు. కాగా, సీఎం, ఎమ్మెల్యేలపై అట్రాసిటీ కేసులు పెడతామంటోన్న దళిత జేఏసీ నేతలు ఆ పనిని ఎప్పుడు చేస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications