సీజే బదిలీతో మొదటికొచ్చిన అమరావతి- ఖర్చూ భరించలేం- ఆపాలని రాష్ట్రపతికి రైతుల లేఖ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన మూడు రాజధానుల ప్రక్రియపై ప్రస్తుతం న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఎప్పుడు తేలుతుందో తెలియదు. సుదీర్ఘంగా సాగుతున్న వాదనల్లో వందల అంశాలు ఇమిడి ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా ముందుకెళ్లడం కూడా సాధ్యం కాదు. అదే సమయంలో అమరావతి పిటిషన్లు విచారిస్తున్న న్యాయమూర్తుల్లో కీలకమైన ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి తాజాగా సిక్కిం హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన బదిలీతో ఈ పిటిషన్లను కొత్తగా వచ్చే సీజేకు అప్పగించాల్సి ఉంటుంది. అప్పుడు కథ మళ్లీ మొదటికొస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి సీజే బదిలీ ఆపాలని రాష్ట్రపతికి వారు లేఖ రాశారు.
అమరావతి పిటిషన్లలో ఛీఫ్ జస్టిస్ పాత్ర..
ఏపీ రాజధానిని అమరావతి నుంచి అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు చోట్ల ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణ ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. అన్నింటి కంటే మించి ఈ పిటిషన్లు అన్నింటినీ ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనమే విచారిస్తోంది. దీంతో మూడు రాజధానుల పిటిషన్లపై జస్టిస్ జేకే మహేశ్వరి ఏదో ఒక సానుకూల నిర్ణయం వెలువరిస్తారని అమరావతి రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ఆయన బదిలీ కావడంతో ఈ పిటిషన్లన్నీ కొత్త ధర్మాసనానికి బదిలీ కావాల్సి వస్తుంది. కానీ అమరావతి వ్యవహారంపై పూర్తిగా పట్టున్న ఆయన బదిలీ కావడం పిటిషనర్లు అయిన రైతులకు ఇబ్బందికరంగా మారింది.
బదిలీ ఆపాలని రాష్టపతికి రైతుల లేఖ
తాజాగా హైకోర్టు ఛీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరిని సుప్రీంకోర్టు కొలీజియం సిక్కిం హైకోర్టు సీజేగా బదిలీ చేసింది. త్వరలో ఆయన రిలీవ్ కావాల్సి ఉంది. దీంతో ఛీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న అమరావతి కేసులన్నీ మరో ధర్మాసనానికి అప్పగించడం ఖాయం. ప్రస్తుత పరిస్ధితుల్లో అలా చేస్తే తమకు న్యాయం జరగదని అమరావతి రైతులు భావిస్తున్నారు. దీంతో మూడు రాజధానుల ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ పూర్తయ్యే వరకూ సీజే మహేశ్వరి బదిలీని ఆపాలని అమరావతి రైతులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. ఇది ఇప్పుడు సంచలనం రేపుతోంది.
తుది విచారణ సమయంలో టదిలీ వద్దంటూ...
ప్రస్తుతం మూడు రాజధానుల కేసులను ఛీఫ్ జస్టిస్ మహేశ్వరితో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ జయసూర్యతో కూడిన ఫుల్ బెంచ్ విచారిస్తోంది. అలాగే రాజధాని కేసుల్లో రైతుల వాదనలు పూర్తయ్యాయి. ప్రభుత్వ వాదనలు కూడా చివరి దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఛీఫ్ జస్టిస్ను బదిలీ చేస్తే ఆ ప్రభావం కచ్చితంగా తుది తీర్పుపై ఉంటుందని రైతులు రాష్ట్రపతికి రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ కొత్త ప్రధాన న్యాయమూర్తి వస్తే తిరిగి ఈ కేసుల విచారణ మొదటికొస్తుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం కూడా విచారణ త్వరగా పూర్తి చేయాల్సి ఉంది. దీంతో సీజే బదిలీ ఆపాలని వారు కోరారు.
భారీ ఖర్చులు మళ్లీ భరించలేం...
హైకోర్టులో రాజధాని పిటిషన్లలో వాదించేందుకు సీనియర్ న్యాయవాదుల్ని భారీ మొత్తం ఖర్చుపెట్టి నియమించుకున్నామని, ఇందుకోసం తమ కష్టార్జితాన్ని చందాలు వేసుకున్నారని రాష్టపతి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు కొత్త ఛీఫ్ జస్టిస్ వస్తే తిరిగి వాదనలు వినిపించేందుకు తాము భారీగా ఖర్చుపెట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని చట్టాలపై హైకోర్టు ఇచ్చే తీర్పు రైతుల జీవనోపాధినే కాదు, రాష్ట్ర భౌగోళిక, ఆర్దిక చరిత్రపైనా ప్రభావం చూపుతుందని వారు తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో న్యాయ వ్యవస్ధపై సామాన్యుల నమ్మకం నిలబెట్టేందుకు ఛీఫ్ జస్టిస్ బదిలీ ఆపాలని రాష్ట్రపతిని వారు కోరారు.