అమరావతికి రఘురామ సాయం- రైతుల విజ్ఞప్తికి ఓకే- చంద్రబాబునూ వదిలేసి
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం, వైసీపీ అధినేత, సీఎం జగన్ కు కంట్లో నలుసుగా మారిపోయిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు మరో కీలక వ్యవహారంలో తలదూర్చబోతున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన ఆ వ్యవహారంలో ఇప్పుడు రెబెల్ అయిన రఘురామ ఎంట్రీ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. ఈ మొత్తం వ్యవహారంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును కాదని అమరావతి రైతులు రఘురామను ఆశ్రయించడం చూస్తుంటే ఏపీలో తాజా పరిస్ధితి ఇట్టే అర్ధమవుతుంది.

జగన్ తో రఘురామ సై అంటే సై
వైసీపీ అధినేత, సీఎం జగన్ తో విభేదించడం ఓ ఎత్తయితే నిత్యం ఆయన్ను టార్గెట్ చేస్తూ లేఖలు కూడా సంధిస్తున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ కీలక వ్యక్తిగా మారిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, తనపై దాడుల్ని దీటుగా ఎదుర్కొంటున్న రఘురామ ఏకంగా సీఎం జగన్ తోనే సై అంటే సై అంటున్నారు. దీంతో ఏపీలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కంటే ఆయనకే ఎక్కువగా మైలేజ్ పెరుగుతోంది.

రఘురామను ఆశ్రయించిన అమరావతి జేఏసీ
ఇప్పటివరకూ మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాష్ట్రంలోనే పోరాటం సాగిస్తున్న అమరావతి జేఏసీ.. ఇప్పుడు పూర్తి స్దాయిలో పార్లమెంటుతో పాటు జాతీయ స్దాయికి తమ పోరును తీసుకెళ్లేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం అమరావతి జేఏసీ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సాయం కోరింది. ఈ మేరకు అమరావతి రైతులు, జేఏసీ నేతలు రఘురామకు లేఖలు రాశారు. అమరావతి వ్యవహారాన్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు, పార్లమెంటులో ప్రస్తావించేందుకు సహకరించాలని రఘురామను వారు కోరారు.

సరేనన్న రఘురామరాజు
అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా ఇప్పటికే కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్న జేఏసీ నేతలు, రైతుల విజ్ఞప్తికి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అంగీకరించారు. పార్లమెంటులో అమరావతి అంశం ప్రస్తావించారంటూ రైతులు చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన రఘురామ... అమరావతి ప్రజలకు మద్దతిస్తానని ప్రకటించారు. దీంతో ఇక పార్లమెంటు వేదికగా అమరావతి పోరును తీసుకెళ్లేందుకు రఘురామ రూపంలో రైతులకు ఓ అండ దొరికినట్లయింది.

చంద్రబాబుకు తీరని అవమానం ?
గత టీడీపీ ప్రభుత్వంలో రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి నిర్మాణం పూర్తి కాకుండానే చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఆ తర్వాత కూడా రాజధానిలో పలుమార్లు పర్యటించారు. అయినా రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఇప్పుడు జగన్ ను ఢీ అంటే ఢీ అంటున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజును అమరావతి జేఏసీ ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పార్లమెటుంలో టీడీపీకి ప్రస్తుతం ముగ్గురు లోక్ సభ ఎంపీలతో పాటు ఓ రాజ్యసభ ఎంపీ కూడా ఉన్నారు. అయినా టీడీపీ అధినేతను కాకుండా రఘురామరాజునే అమరావతి జేఏసీ తమకు మద్దతివ్వాలని కోరడం చంద్రబాబుకు తీరని అవమానంగా మారింది.












Click it and Unblock the Notifications