నేటి నుంచి ఏపీ అసెంబ్లీ, 5 రోజుల్లో సభ ముందుకు 17 బిల్లులు..
ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ 9 గంటలకు, మండలి 10 గంటలకు సమావేశం కానున్నది. అసెంబ్లీ ఐదు రోజులు జరగనుండగా.. సమావేశాల్లో 17 వరకు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ప్రవేశపెట్టే బిల్లుల విషయంలో స్పష్టత లేదని తెలుస్తోంది. గవర్నర్ వద్ద, సీఎం కార్యాలయం వద్ద ఐదు బిల్లులు/ఆర్డినెన్సులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో శాసనసభలో 12-13 బిల్లులు ప్రవేశపెట్టే వీలుంది.
పోలవరం ఎత్తుపై వివాదం..
పోలవరం ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఎత్తును 45.72 మీటర్లకు కాకుండా ..41.15 మీటర్ల మేర మాత్రమే ఉంచేలా భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందనే చర్చ జరుగుతోంది. ప్రాజెక్టు ఎత్తు అంగుళం కూడా తగ్గించబోమంటూ ప్రభుత్వం చెబుతోందే తప్ప.. 45.72 మీటర్ల మేర నీటి నిల్వ చేస్తుందో లేదో స్పష్టం చేయడం లేదు. దీంతో పోలవరంపై సభలో చర్చించాలని అధికార పక్షం నిర్ణయించింది.
నివాళి అర్పించి
తొలిరోజు పలువురి మృతికి శాసనసభ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఎమ్మెల్యేలు జనార్థన్ థాట్రాజ్, రావి రవీంద్రనాథ్ చౌదరి, వెంకట చంద్రమోహనరావు, పైడికొండల మాణిక్యాలరావు, దిరిశల రాజగోపాలరెడ్డి, అమ్మిరాజు, వీర రాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాదరావు, ద్రోణంరాజు శ్రీనివాసరావు, మోచర్ల జోహర్, కందుల శివానందరెడ్డి, వైటీ రాజు, డీఏ సత్యప్రభల మరణానికి సభ సంతాపం తెలుపనుంది.
3 రోజుల్లో బిల్లుల ఆమోదం..
అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే జరుగుతున్నందున.. మూడు రోజుల్లో శాసనసభలో బిల్లులను ఆమోదించుకోవాలని భావిస్తోంది. గురువారం వాటిని మండలికి పంపి.. అక్కడా ఆమోదం లభించేలా చేసుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. గతంలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లు శాసనమండలిలో తిరస్కరణకు గురైంది. శుక్రవారం మళ్లీ ఆర్డినెన్స్ తెచ్చారు. తిరిగి బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మండలిలో దీనికి ఆమోద ముద్ర వేయించుకోవాలని అనుకుంటోంది.
చర్చించేవి ఇవే..
పోలవరం ప్రాజెక్టు-గత ప్రభుత్వ తప్పిదాలు.. ఇళ్ల స్థలాల పంపిణీ-ప్రతిపక్షాల కుట్ర.. టిడ్కో గృహాలు-వాస్తవాలు.. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ-ప్రతిపక్షాల కుట్ర.. పారిశ్రామికాభివృద్ధి.. వ్యవసాయానికి 9 గంటలఉచిత విద్యుత్-విద్యుత్ రంగంలో సంస్కరణలపై చర్చించే అవకాశం ఉంది.
Recommended Video
ఆర్డినెన్స్లు..
తొలి రోజు సోమవారం రాష్ట్ర ఆర్థిక బాధ్యత, బడ్జెట్ యాజమాన్య నిర్వహణ బిల్లు (ఆర్డినెన్స్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ సవరణ బిల్లు (ఆర్డినెన్స్)ను ఆర్థిక మంత్రి బుగ్గన సభలో ప్రవేశ పెడతారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రెండో సవరణ బిల్లు (ఆర్డినెన్స్)-2020ను సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూముల సవరణ, భూబదలాయింపు నిరోధక బిల్లుల(ఆర్డినెన్స్)ను ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఏపీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) సవరణ బిల్లు (ఆర్డినెన్స్)ను ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, ఏపీ మునిసిపల్ చట్టం సవరణ బిల్లు (ఆర్డినెన్స్)ను మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీ గేమింగ్ బిల్లు (ఆర్డినెన్స్)ను మంత్రి సుచరిత, ఏపీ ఫిష్పీడ్ బిల్లు, ఆక్వాకల్చర్ సీడ్ బిల్లుల(ఆర్డినెన్స్)ను మంత్రి అప్పలరాజు ప్రవేశపెడతారు.
జీఎస్టీ చట్టంలో భాగంగా జారీ చేసిన ఉత్తర్వులను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సభ ముందుంచుతారు. ఉన్నత విద్యకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను మంత్రి అప్పలరాజు, ఆంధ్రప్రదేశ్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ 2014-15 వార్షిక నివేదికను మంత్రి కన్నబాబు ప్రవేశపెడతారు.