గిఫ్ట్ పేరుతో కేసీఆర్ భయపెడుతున్నారు: బాబు, 'తెలంగాణ' దెబ్బతో మాట్లాడనని చెప్పిన లగడపాటి!
గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఏర్పాటు చేస్తున్న 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద రావు పాల్గొన్నారు. దాదాపు 50 ఎకరాల చెరువు మధ్యలో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ చెరువుకు తారకరామ సాగరంగా నామకరణం చేశారు.
ఈ సాగర్లో పడవలో విహరించారు. అనంతరం చెరువు పక్కనే ఉన్న పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్లను చంద్రబాబు ప్రారంభించారు. అంతకుముందు, పార్టీ నేతలతో నిర్వహించిన కాన్ఫరెన్సులో మాట్లాడారు. నేటి తరానికి ఎన్టీఆర్ స్ఫూర్తి అన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్నారు.
బీజేపీ రూపంలో నిరంకుశత్వం
నిరంకుశత్వాన్ని ఎదిరించడం నేర్పింది ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు నిరంకుశత్వం బీజేపీ రూపంలో, పెత్తందారీ ప్రధాని నరేంద్ర మోడీ రూపంలో ఉందని ఆరోపించారు. అందుకే బీజేపీపై ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ఇంకా వంద రోజుల సమయం ఉందని, టీడీపీ ఘన విజయం సాధించాలన్నారు. దేశ రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చాల్సిన అవసరముందన్నారు.
ఏపీలో ఎలా ఉంటావ్, ఎందుకలా చేశారో: జగన్-షర్మిలకు చంద్రబాబు గట్టి కౌంటర్
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పేరుతో బెదిరిస్తున్నారు కానీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనకు ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని బెదిరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒక్క గిఫ్ట్ ఇస్తే, తెలుగు ప్రజలు మూడు గిఫ్ట్లు ఇస్తారని చెప్పారు. కేసీఆర్కు అవినీతి తమ్ముడు.. వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తోడయ్యాడన్నారు.
కేసీఆర్, జగన్లు కలిసినా ఏపీని ఏం చేయలేరు
కేసీఆర్, జగన్లు కలిసినా ఏపీని ఏం చేయలేరని చెప్పారు. కేంద్రం ఏపీకి చేస్తోన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈడీ దాడులు చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేసే వరకు కేంద్రాన్ని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నవ్యాంధ్రకు కేంద్రం అన్యాయం చేస్తోందని, జగన్, కేసీఆర్లు మోడీకి అనుకూలంగా ఉన్నారన్నారు.
తెలంగాణ ఎన్నికల దెబ్బతో మాట్లాడనని చెప్పిన లగడపాటి
ఇదిలా ఉండగా, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి కలిశారు. ఈ నెల 27వ తేదీన తన ఇంట్లో జరిగే శుభకార్యానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ పైన మాట్లాడనని చెప్పారు. రాజకీయాలపై మాట్లాడేందుకు ఇది సమయం కాదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సర్వే ఫలితాలు ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో కేసీఆర్ పెడరల్ ఫ్రంట్పై మాట్లాడేందుకు నిరాకరించారని చెబుతున్నారు.