తెలుగు రాష్ట్రాలపై ఫోకస్.. అధికారమే లక్ష్యం: జీవీఎల్
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. ఫలితాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ 404 స్థానాలు అని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో 2024 ఎన్నికల వరకు బీజేపీ మరింత బలపడుతుందన్నారు. బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై దృష్టి సారించామని వెల్లడించారు. 42 లోక్ సభ స్థానాలు ఉన్న ఏపీ, తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉండనున్నాయని కామెంట్ చేశారు. పలువురు నేతలు తమను సంప్రదిస్తున్నారని జీవీఎల్ చెప్పారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికలు ఉండనున్నాయని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బోర్డు మూసేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ముందస్తు ఎన్నికల గురించి విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై జీవీఎల్ రియాక్ట్ అయ్యారు. 6 నెలల తర్వాత ఓడుతామనుకునే వారు ముందుగా వెళ్లినా ఓడిపోతారని గుర్తు చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళతారని అనుకోవడం లేదన్నారు. బీజేపీది ఓపెన్ డోర్ పాలసీ అని.. ఎవరు వచ్చినా పార్టీలోకి స్వాగతిస్తాం అన్నారు.

మూడో ఫ్రంట్ ప్రయత్నం కాదు.. టీఆర్ఎస్కు మూడిందన్నారు. తెలంగాణలో మంచి మెజార్టీతో బీజేపీ అధికారంలోకి రానుందని జోస్యం చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇలా కామెంట్ చేశారు. తెలంగాణలో యూపీ తరహా ఫలితాలే రిపీట్ అవుతాయని, బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. యూపీలో దౌర్జన్యాలు, అన్యాయాలపై యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపారని రాజా సింగ్ అన్నారు. ప్రజా సంక్షేమానికి కృషి చేశారని.. అందువల్లే యోగి గెలవాలని యావత్ భారత్ కోరుకుందన్నారు.
తెలంగాణలో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని రాజా సింగ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కుటుంబపాలనకు తెరపడుతుందని, బీజేపీ పవర్ లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్కి కలలోకి కూడా మోడీ వస్తున్నారని.. నిద్రలోనూ కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని రాజా సింగ్ అన్నారు. ఇక దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, తెలంగాణలో కూడా ఈసారి ఆ పార్టీ ఖతం అవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications